రియో ఒలింపిక్‌ పతక విజేత మృతి.. అసలేం జరిగింది..?

రియో ఒలింపిక్‌ పతక విజేత మృతి.. అసలేం జరిగింది..?

రియో ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన అమెరికన్‌ స్ప్రింటర్‌, లాంగ్‌ జంపర్‌ టోరీ బోవీ (32) మృతిచెందింది. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నివాసం ఉంటున్న టోరీ బోవీ.. గత కొన్ని రోజులుగా బయట కన్పించట్లేదని.. స్థానిక అధికారుల బృందం ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లగా విగతజీవిగా కన్పించింది. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌ కంపెనీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు.

టోరీ బోవీది సహజమరణమే అయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని పేర్కొన్నారు. టోరీ మృతి పట్ల ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, తోటి ఒలింపిక్‌ ఛాంపియన్లు, అథ్లెట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

2016లో జరిగిన రియో ఒలింపిక్‌ గేమ్స్‌లో టోరీ బోవీ మూడు పతకాలు గెలుచుకుంది. 4×100 మీటర్‌ రిలే విభాగంలో స్వర్ణం, 100 మీటర్ల రిలే విభాగంలో రజతం, 200 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించింది. 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ 100 మీటర్ల రేసులో బంగారు పతకం నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 2022 జూన్‌లో ఆమె చివరిసారిగా అధికారిక పోటీల్లో పాల్గొంది.