అముల్ పాల ధరలు పెరిగాయి. లీటర్ కు 2 రూపాయలు పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్లు బుధవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు రేట్లు దేశవ్యాప్తంగా జూలై 1 నుండి అమల్లోకి వస్తాయి. దాదాపు ఏడాది తర్వాత పాల ధరలను పెంచుతున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధి తెలిపారు. ఉత్పత్తి ఖర్చు పెరగడం కారణంగానే ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త ధరలు అన్ని అముల్ పాల బ్రాండ్లైన గోల్డ్, తాజా, శక్తి, టి-స్పెషల్ తో పాటు ఆవు, గేదె పాలకు వర్తిస్తాయన్నారు. ధరల పెంపు ప్రభావం ఒక్క పాలపైనే కాకుండా.. ఇతర ఉత్పత్తులకూ వర్తిస్తుందన్నారు.
పశువులకు దాణా కొరత, వాటి పోషణ ఖర్చురెట్టింపు కావడంతో పాడి రైతులు తమకు చెల్లించాల్సిన పాల రేట్లను పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు ప్యాకేజింగ్ ఖర్చు 30 నుండి 40 శాతం, రవాణా ఖర్చు 30 శాతం, ఇంధన వ్యయం 30 శాతం పెరిగిందన్నారు. దీంతో పాల ధరను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సోధి.