గద్వాల జిల్లా మానవపాడులో చిన్నారి అవస్థ 

గద్వాల జిల్లా మానవపాడులో చిన్నారి అవస్థ 
  •  నొప్పి భరించలేకపోతున్నానంటూ ఆవేదన 

  •  తమ ఎదుట ఇలాంటిదేదీ జరగలేదన్న కర్నూలు డాక్టర్లు   

  •  తన బిడ్డ బాధ పోగొట్టాలంటున్న తల్లిదండ్రులు  

మానవపాడు, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఓ 11 ఏండ్ల బాలిక కండ్లలో నుంచి బియ్యపు గింజలు, చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయి. మూడు రోజులుగా ఇలా జరుగుతుండడంతో నొప్పి భరించలేకపోతున్నానని ఆ పాప ఆవేదన వ్యక్తం చేస్తోంది. చాలామంది పిల్లలకు గతంలో కొన్నిచోట్ల కండ్లలో నుంచి చిన్న రాళ్లు వచ్చాయన్న వార్తలు వచ్చాయి. కానీ, ఇక్కడ మాత్రం బియ్యపు గింజలు, రాళ్లు రావడం, అది కూడా 15 నిమిషాలకు ఒకసారి జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మానవపాడుకు చెందిన నంద్యాల రంగన్న-, లక్ష్మిలకు దీపాలి (11) కూతురు. మూడు రోజుల క్రితం దీపాలి కండ్లలో నుంచి చిన్న రాళ్లు, బియ్యం గింజలు రావడం మొదలైంది. అవి బయటకు వచ్చినప్పుడల్లా తీవ్రమైన నొప్పి బాధిస్తోంది. దీపాలిని కర్నూలులోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకువెళ్లారు. వారి పర్యవేక్షణలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు చెప్పినట్టు జరగలేదు. దీంతో స్కానింగ్ తీసి సమస్య ఏమీ లేదని  ఇంటికి పంపించారు. ప్రతిరోజు 10 నుంచి 12 వరకు రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయని.. ఎవరైనా డాక్టర్లు స్పందించి తమ బిడ్డ బాధను పోగొట్టాలని కోరుతున్నారు. 

చిన్నప్పుడు పోయి ఉండొచ్చు

చిన్నతనంలో ముక్కు ద్వారా కంటి గ్రంధిలోకి రాళ్లు, బియ్యపు గింజలు పోయి ఉండవచ్చు. ఇలాంటి కేసులు ఇంతకుముందు కొన్ని వెలుగులోకి వచ్చాయి. పరీక్షలు చేస్తే ఎందుకు ఇలా జరుగుతుందో ఖచ్చితంగా చెప్పొచ్చు. – డాక్టర్ వెంకటాచారి, మానవపాడు ప్రభుత్వ దవాఖాన