గచ్చిబౌలిలో నిండు గర్భిణీ హత్య

గచ్చిబౌలిలో నిండు గర్భిణీ హత్య

హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. వాసంశెట్టి స్రవంతి అనే మహిళను ఓ వ్యక్తి వేట కొడవలితో నరికి చంపాడు. మృతురాలు స్రవంతి ప్రస్తుతం 8నెలల గర్భవతి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకటరామకృష్ణ, స్రవంతి దంపతులు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్నారు. 2020లో తన చిన్నమ్మ కూతురు లక్ష్మీప్రసన్నకు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కావూరు శ్రీరామకృష్ణతో పెళ్లి చేయించాడు వెంకటరామకృష్ణ. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం శ్రీరామకృష్ణ వేధిస్తుండడంతో లక్ష్మీప్రసన్న భర్తకు దూరంగా ఉంటోంది. గత నెలలో లక్ష్మీప్రసన్న చందానగర్ పోలీస్ స్టేషన్ లో భర్త, అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీరామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. వీటన్నింటికీ రామకృష్ణ దంపతులే కారణమని శ్రీరామకృష్ణ వారిపై పగ పెంచుకున్నాడు. 

ఎలాగైనా బావమరిదిని హత్య చేయాలని శ్రీరామకృష్ణ నిర్ణయించుకున్నాడు. ఎర్రగడ్డలో వేట కొడవలి కొనుగోలు చేశాడు. ఈ నెల 6వ తేదీన కొండాపూర్ లో బావమరిది ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటరామకృష్ణ ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య స్రవంతిపై కత్తితో దాడి చేసి, పారిపోయాడు. వెంటనే బాధితురాలిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి స్రవంతి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.