హిందూ మహా సముద్రంలో.. ఒకే రోజు మూడు సార్లు భూకంపం

హిందూ మహా సముద్రంలో.. ఒకే రోజు మూడు సార్లు భూకంపం

హిందూ మహా సముద్రంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒకే రోజులో మూడో సారి భూకంపం సంభవించడం గమనార్హం. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. హిందూ మహాసముద్రంలో గురువారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అంతకుముందు కూడా.. 6.4 తీవ్రతతో కూడిన మరొక భూకంపం ఆ ప్రాంతాన్ని 10 కిలోమీటర్ల లోతులో కుదిపేసింది. 4.8 తీవ్రతతో మరో భూకంపం ఆ ప్రాంతాన్ని 10 కి.మీ లోతులో తాకింది. ఇలా వరుస భూకంపాలతో హిందూ మహా సముద్రంలో కల్లోలం రేగింది.

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఈ క్రమంలో.. తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.

డిసెంబర్ 26, 2004న ఉదయం 07:58:53 గంటలకు (స్థానిక సమయం) ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలోని ఆషే పశ్చిమ తీరంలో 9.2-9.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సుమత్రా-అండమాన్ భూకంపం అని పిలువబడే ఈ సముద్ర గర్భ మెగా థ్రస్ట్ భూకంపం.. బర్మా ప్లేట్, ఇండియన్ ప్లేట్ మధ్య చీలిక కారణంగా సంభవించింది. 

ఈ భూకంపం వల్ల 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగసిపడి భారీ సునామీ వచ్చింది. ఈ సునామీ వల్ల.. ఆషే (ఇండోనేషియా), శ్రీలంక, తమిళనాడు (భారతదేశం), ఖావో లక్ (థాయిలాండ్) దేశాలలో 2 లక్షల 27 వేల 898 మంది మరణించారు. ఇది చరిత్రలో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న సునామీగా మిగిలిపోయింది.