హైదరాబాద్​లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

హైదరాబాద్​లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

మాదాపూర్, వెలుగు: బ్యాక్ డోర్​లో ఐటీ​ జాబ్స్​ ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ 150 మందిని ముంచింది. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను నమ్మించేందుకు కంపెనీ ప్రతినిధులు మూడు నెలల పాటు ట్రైనింగ్​ ఇవ్వడంతోపాటు నెలకు ఆరు వేల చొప్పున శాలరీ కూడా చెల్లించారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లికి చెందిన ప్రతాప్​ కొండాపూర్ జూబ్లీ గార్డెన్​ ఏరియాలో డాన్యోన్  ఐటీ టెక్నాలజీ ప్రైవేట్​లిమిటెడ్​ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఐటీ కంపెనీల్లో బ్యాక్​డోర్స్​ జాబ్స్​ ఇప్పిస్తానంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేశాడు. మల్కాజిగిరికి చెందిన దిలీప్ ఇటీవలే పీజీ పూర్తి చేసి జాబ్​ కోసం చూస్తున్నాడు. 
 
ఈ క్రమంలో దిలీప్​ ఆ ప్రకటన చూసి ఫోన్​ చేశాడు. ఏడాదికి రూ.8.5 లక్షల ప్యాకేజీ ఇప్పిస్తామని, ఇందుకోసం మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్​ టైమ్​లో రూ.20 వేలు, ఆఫర్​ లెటర్​ఇచ్చి లక్షా 70 వేలు వసూలు చేశాడు. మూడు నెలల పాటు ట్రైనింగ్​ఉంటుందని ఆన్​లైన్​లో వీడియోలు పంపించాడు. తర్వాత జీతం ప్రస్తావన తేవడంతో నెలకు ఆరు వేల చొప్పున దిలీప్​కు చెల్లించాడు. ట్రైనింగ్​పూర్తయ్యాక జాబ్​ గురించి అడగ్గా.. రేపు, మాపు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో దిలీప్​తోపాటు మోసపోయిన మరి కొందరు ఆఫీస్​కు వెళ్లి అడగ్గా.. కొన్నాళ్లు ఆగాలని చెప్పి పంపించి ఆఫీస్​ను మాదాపూర్​ అయ్యప్ప సొసైటీకి మార్చాడు.

బాధితులంతా కొత్త ఆఫీస్​ అడ్రస్​ తెలుసుకుని వెళ్లగా అక్కడ నర్సింహారెడ్డి అనే వ్యక్తి సదరు కంపెనీని తాను కొనుగోలు చేశానని, అక్టోబర్​ నుంచి జీతాలిస్తామని చెప్పి ఆ తర్వాత ఆయన కూడా స్పందించలేదు. దీంతో ఈ నెల 21న అసెంబ్లీ వద్ద  కంపెనీ సీఈఓ ప్రతాప్​ను పట్టుకున్న బాధితులు మాదాపూర్​ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రతాప్​ దాదాపు 150  మంది వద్ద నుంచి రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. సుమారు మూడు కోట్ల వరకు మోసం చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటివరకు 10 మంది కంప్లైంట్ ఇచ్చారని, బాధితులు మరింత మంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ప్రతాప్​కు నోటీసులిచ్చి పంపినట్లు ఇన్​స్పెక్టర్​ రవీంద్ర ప్రసాద్​ తెలిపారు. అయితే కంపెనీ సీఈఓను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రిమాండ్​ చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించేయడం ఏంటని యూత్​ కాంగ్రెస్​లీడర్​శివసేనారెడ్డి ప్రశ్నించారు. బాధితుల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.