ఆ వినాయకుడి విగ్రహం ఏ కాలం నాటిదో తెలుసా..

ఆ వినాయకుడి విగ్రహం ఏ కాలం నాటిదో తెలుసా..

హైదరాబాద్‌ శివారులోని పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలంనాటి గణేశుని విగ్రహాన్ని చరిత్రకారులు గుర్తించారు. శంషాబాద్ లో చాళుక్యుల కాలంనాటి వినాయకుడి విగ్రహం బయటపడింది. దాదాపు 8 వందల సంవత్సరాల క్రింది రాత్రి విగ్రహం బయటపడడంతో చుట్టుపక్క ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం, ఆంజనేయ ఆలయాల్లోని చారిత్రక శిల్పాలను చరిత్ర కారులు పరిశీలించారు. శివాలయం ముందు మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల మందంతో నల్లశానపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం, తలపై చిన్నకిరీటం, లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయాలు కంకణాలు, కాళ్ళకు కడియాలు ధరించి, లలితాసనంలో కూర్చొని ఉన్నాడని ప్రతిమాలక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం, క్రీ.శ.12వ శతాబ్దికి చెందిన కళ్యాణీ చాళుక్య శిల్పశైలికి అద్దం పడుతుందని చెప్పారు.

గణేశుని విగ్రహం పక్కన కాకతీయ స్తంభం, కప్పురాయి, శిఖరశిథిలాలు, గ్రామంలోని ఆంజనేయాలయంలో క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన చక్కటి ఉమామహేశ్వర శిల్పం, అద్భుతంగా అలంకరించిన నంది విగ్రహాలున్నాయని వీటిని శివాలయం నుంచి ఇక్కడికి తరలించినట్లు స్థానికులు చెప్పినట్లు వెల్లడించారు. పెద్దగోల్కొండలో గుర్తించిన గణేశ, ఉమామహేశ్వర, నంది విగ్రహాలు కళ్యాణీ చాళుక్య, కాకతీయుల కాలానికి చెందినవనని చరిత్రకారులు చెబుతున్నారు. .