అంజు భారత్‌కు తిరిగి వచ్చింది..! ఇప్పుడామె ఎక్కడుంది..?

అంజు భారత్‌కు తిరిగి వచ్చింది..! ఇప్పుడామె ఎక్కడుంది..?

రాజస్థాన్ కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా..? ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ వెళ్లి, అతడిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె తిరిగి వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు వచ్చింది.

తాను సంతోషంగా ఉన్నానని, ఇంకేం చెప్పలేనని అంజు మీడియాతో చెప్పింది. పాకిస్తాన్‌, పంజాబ్‌ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్‌కు తిరిగి వచ్చిన అంజును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ వద్ద ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత అమృత్‌సర్‌ విమానాశ్రాయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు. ఆమె పాకిస్తాన్‌కు వెళ్లడంపై మరింతగా ప్రశ్నించనున్నారు.

అంజుకు ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా అనే యువకుడితో 2019లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తాను పాక్‌కు వెళ్లలేదని చెప్పిన ఆమె.. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజుల తర్వాత నస్రుల్లా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అంజు తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పారు. ఆమె మానసిక వేదనతో సతమతమవుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు చెప్పాడు.

అంజుకు ఇదివరకే వివాహమైంది. 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. పాక్‌లో నస్రుల్లాను పెళ్లి చేసుకున్న తర్వాత అంజు తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఈ జంటకు అక్కడ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మొహసీన్‌ ఖాన్‌ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. అయితే ఆమె చేసిన నిర్వాకంతో భారత్‌లోని ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.