- సౌత్ ఆఫ్రికా గబ్బిలాల్లో గుర్తించిన వూహాన్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు
- మెర్స్లో ఇదో రకమని వెల్లడి
- సోకితే ముగ్గురిలో ఒకరు చనిపోతారని హెచ్చరిక
వూహాన్: కరోనా ప్రపంచాన్ని చుట్టేసి రెండేండ్లాయే.. ఆ రెండేండ్లలో ఎన్నో వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ‘డెల్టా’తో ప్రపంచమంతా అల్లాడిపోయింది. దాని బెడద పోయిందనుకుంటుండగానే.. ఒమిక్రాన్ వచ్చి పడింది. యమా స్పీడుగా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అయితే, ఇప్పుడు మరో కొత్త కరోనా వైరస్ ‘నియోకొవ్’ పుట్టుకొచ్చేసింది. అయితే, ఇది ‘డెల్టా’, ‘ఒమిక్రాన్’లాగా కరోనా వేరియంట్ కాదు. కరోనా వైరస్లలోనే ఓ జాతి. దీనిని ప్రస్తుత కరోనా పుట్టిన చైనా సైంటిస్టులే గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ఆ వైరస్ ఆనవాళ్లున్నాయని వూహాన్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ సైంటిస్టులు చెప్తున్నారు. 2012, 2015లో మిడిల్ ఈస్ట్ దేశాలపై పంజా విసిరిన ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్)’లోనే కొత్త స్ట్రెయిన్ అని అంటున్నారు. ఈ ‘మెర్స్– నియోకొవ్’ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మనుషులకు సోకిందా?
గబ్బిలాల్లో గుర్తించిన ఈ స్ట్రెయిన్ ఇంకా మనుషుల దాకా రాలేదని, దీని జీన్స్లో మరొక్క మ్యుటేషన్ జరిగితే మనుషులకు సోకే ముప్పు ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. పీడీఎఫ్2180 కొవ్ అనే రకం కూడా మనుషులదాకా చేరే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్తో పోలిస్తే నియోకొవ్.. యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ)–2 రిసెప్టార్లతో బాండింగ్ చేసుకునే విధానం కొత్తగా ఉందని, కాబట్టి కరోనా కన్నా దాని తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్లు. నియోకొవ్పై పనిచేయవని, యాంటీ బాడీలున్నా వైరస్ సోకకుండా అడ్డుకోలేవని చెప్తున్నారు. అయితే, ఈ వైరస్కు సంబంధించి డబ్ల్యూహెచ్వో ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు.