తెలంగాణకు మరో వందే భారత్ రైలు

తెలంగాణకు మరో వందే భారత్ రైలు

తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. తెలంగాణ నుంచి  మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది. ఈ రైలు వస్తే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు కేవలం 8.30 గంటల్లోనే చేరుకోవచ్చు. 

24 తేదీనుంచి కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. మొదటిరోజు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత ప్రతిరోజూ (బుధవారం మినహా)  కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపూర్ (10.54) స్టేషన్లలో ఆగుతూ యశ్వంత్‌పూర్ (మధ్యాహ్నం 2.15) చేరుకుంటుంది.

Also Read : సీఐడీ కస్టడీకి చంద్రబాబు: 2 రోజులు విచారణ

మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్‌పూర్‌నుంచి బయలుదేరి, అనంతపూర్ - 5.40, కర్నూల్ సిటీ 7.50, మహబూబ్‌నగర్ 21.39 స్టేషన్లలో ఆగుతూ.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30కి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్,దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. 

భారతీయ రైల్వే గురువారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ నిర్వహించింది . ఈ రైలు 610 కిలోమీటర్ల దూరాన్ని 7.5 గంటల్లో అధిగమించింది. కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంది. తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైలు బయలుదేరింది. కొత్త రైలులో ఎనిమిది కార్ల అనుసంధానం చేయబడ్డాయి.