విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్... దేశంలోనే తెలంగాణ మూడోస్థానం

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్... దేశంలోనే తెలంగాణ మూడోస్థానం
  • ప్రిస్క్రిప్షన్​ లేకున్నా మెడికల్ ​షాపుల్లో యథేచ్ఛగా అమ్మకాలు
  • జ్వరం, దగ్గు, డయేరియా, ఒళ్లు నొప్పులకూ వాడకం
  • మానవాళికి ముప్పుగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 
  • సూపర్​బగ్స్​ ఏర్పడి ఏ మందులకూ లొంగని రోగాలతో ప్రజలు సతమతం
  • యాంటీ బయాటిక్స్​ వాడకంపై అవగాహన కల్పించాలంటున్న ఎక్స్​పర్ట్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నపాటి సమస్యలకూ ఆపదమొక్కుల వైద్యంగా వీటి నే మింగేస్తున్నారు. దీంతో తీవ్రమైన ముప్పును కొనితెచ్చుకుంటున్నారు. చిన్నా చితకా అనారోగ్యాలకే యాంటీ బయాటిక్స్​ను విచ్చలవిడిగా వాడేయడం వల్ల బ్యాక్టీరియా ఏ మందులకు లొంగని ‘సూపర్​బగ్’​గా మారుతుందని  వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్​వో) హెచ్చరిస్తున్నాయి.  

ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్​) అనే సమస్య ఇప్పుడు   దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. యాంటీ బయాటిక్స్​ వినియోగంలో  దేశంలోనే మూడో స్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. కొవిడ్​ తర్వాత యాంటీ బయాటిక్స్ వినియోగం మరింత పెరిగింది. 

గ్రామాల్లో రోజు కూలీకి వెళ్లే వాళ్లు, వ్యవసాయ పనులు చేసేటోళ్లు కూడా అధిక సంఖ్యలో యాంటీబయాటిక్స్​ వాడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కాస్త నలతగా ఉంటే వెంటనే మందులు వేసేసుకుని పనులకు వెళ్తున్నారని తేలింది. ఇలా చేస్తే ఆ సమయానికి ఉపశమనం లభిస్తున్నా.. భవిష్యత్తులో పెనుప్రమాదంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  మెడికల్​ షాప్​ల్లోనూ డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ లేకుండానే యాంటీబయాటిక్స్​ విక్రయిస్తున్నారు. 

ఇటీవల రాష్ట్ర డ్రగ్​ కంట్రోలర్​ ఆఫీసర్ల దాడుల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా యావరేజ్​గా రెండు కోట్లకు పైగా మంది యాంటీబయాటిక్స్​ తీసుకుంటుండగా.. ఇందులో ఎక్కువ మంది డాక్టర్ల సూచన మేరకు కాకుండా సొంతంగానే వినియోగిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్​ లేకుండా వాడుతున్నోళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.    

అవగాహన లేమి.. విచ్చలవిడి విక్రయాలు

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో యాంటీ బయాటిక్స్ విక్రయాలు నిరంతరం జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన లేమి, అలాగే తక్షణ ఉపశమనం పొందాలనే ఆత్రుతతో చాలామంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు లాంటి సాధారణ సమస్యలకు కూడా ఒక్కరోజు కూడా ఆగకుండా వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. ఇటీవల డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్ల దాడుల్లో ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 

ఏకంగా 193 మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీ బయాటిక్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్1 కింద ఉండే యాంటీ బయాటిక్స్ లాంటి మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదు. అయినప్పటికీ ఈ నిబంధనలను చాలా మెడికల్ స్టోర్ల యజమానులు బేఖాతరు చేస్తున్నారు.

ఏఎంఆర్​ ప్రపంచానికి పెనుముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ఏఎంఆర్​ ను ప్రపంచంలోని టాప్ 10 ఆరోగ్య ముప్పుల్లో ఒకటిగా ప్రకటించింది. గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అధ్యయనం ప్రకారం, ఏఎంఆర్​కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. నిరుడు దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనాల్లో ఈ అంశం వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2050 నాటికి క్యాన్సర్ కారక మరణాల కంటే ఎక్కువగా ఏటా కోటి వరకు ఏఎంఆర్​ మరణాలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రాణనష్టంలోనే కాదు, ఏఎంఆర్ అన్ని దేశాలను ఆర్థికంగా కూడా దెబ్బతీసే శక్తిని కలిగి ఉంది. 

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఏఎంఆర్ కారణంగా 2050 నాటికి 100 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా. జీడీపీలో 3.5 శాతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచ ఎగుమతుల్లో 3.5 శాతం వరకు తగ్గవచ్చని తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోతారు.

ఏమిటీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్?

యాంటీ బయాటిక్స్​ను మితిమీరి, అస్తవ్యస్తంగా వాడటం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్​) సమస్య ఉత్పన్నమవుతుంది. వైద్య నిపుణుల సలహా లేకుండా యాంటీ బయాటిక్స్​ను ఇష్టారీతిన వాడితే, వ్యాధి కారక బ్యాక్టీరియా వాటికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. చివరికి అవి ఏ మందుకూ లొంగకుండా మరింత బలం పుంజుకుంటాయి. ఇలాంటి బ్యాక్టీరియాను ‘మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ జీవులు’ లేదా ‘సూపర్ బగ్స్’ అని పిలుస్తారు.  అప్పుడు టీకాలు, ఇతర ఔషధాలు ప్రయోగించినా ఫలితం లేకుండా పోతుంది.

స్మార్ట్ ఫోన్లతో పెరిగిన సొంత వైద్యం

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, ప్రజలు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే గూగుల్‌‌లో వెతికి, అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్లి స్వయంగా కొని వాడేస్తున్నారు. ఈ జాబితాలో యాంటీ బయాటిక్స్ కూడా ఉంటున్నాయి. కొందరైతే మెడికల్ షాపులకు వెళ్లి, తమకున్న సమస్య చెప్పి నేరుగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అలవాటు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నది. కేవలం తెలంగాణలోనే ఏటా సుమారు 2 కోట్లకు పైగా మంది యాంటీ బయాటిక్స్​ను వినియోగిస్తున్నారు. వీరిలో అత్యధిక మంది మోతాదుకు మించి, లేదా సరైన అవగాహన లేకుండా వాడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రిస్ర్కిప్షన్​ లేకుండా యాంటీ బయాటిక్స్​ వాడొద్దు

అసలు డాక్టర్​ అవసరం లేదన్నట్లుగా యాంటీబయాటిక్స్​ ఈజీగా వాడేస్తున్నారు. గ్రామాల్లో నేరుగా మెడికల్​ షాప్​లకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్నారు. వైద్యులు సూచించకుండా సొంతంగా యాంటీ బయాటిక్స్ వాడకూడదు. ఏ సమస్యకు ఏది వాడాలో వైద్యులు మాత్రమే నిర్ణయించాలి.  యాంటీ బయాటిక్స్​ను వైద్యులు చెప్పినన్ని రోజులు, అదే మోతాదులో వాడాలి. మధ్యలో ఆపకూడదు. లేదా ఎక్కువ రోజులు వాడకూడదు. 

మెడికల్ షాపుల యజమానులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించడాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ప్రిస్క్రిప్షన్‌‌‌‌తో ఆన్‌‌‌‌లైన్ లింక్ చేసి, కౌంటర్ సేల్స్​ను తగ్గించాలి. 
- ప్రొఫెసర్​ కిరణ్​ మాదాల, గాంధీ మెడికల్ కాలేజీ

అతిగా వాడితే ముప్పే 

యాంటీ బయాటిక్స్‌‌‌‌ను మితిమీరి వాడడం మానవాళి మనుగడకు ముప్పే. అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అతిగా యాంటీ బయాటిక్స్‌‌‌‌ వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్‌‌‌‌ను నాశనం చేస్తున్నాయి. కీడు చేసే యాంటీ మైక్రోబియల్‌‌‌‌ రెసిస్టెన్స్‌‌‌‌ (ఏఎంఆర్‌‌‌‌) పెరగడానికి కారణమవుతున్నాయి. దీనిని అరికట్టాలి.  

మెడికల్‌‌‌‌ షాపుల వాళ్లు రోగులకు ప్రిస్క్రిప్షన్‌‌‌‌ ఉంటేనే మందులివ్వాలి. ఇష్టమొచ్చినట్టుగా ఇవ్వడం వల్ల.. కోర్సు మొత్తం పూర్తి చేయకుండా కొంతమంది 2 మాత్రలు వాడి తగ్గగానే మానేస్తున్నారు. ఆ తర్వాత అవి వాడితే పనిచేయట్లేదు.  
- డాక్టర్​ భూషణ్​ రాజ్, నిమ్స్