ఎంత మందికి కరోనా వచ్చి.. పోయింది?..త్వరలోనే యాంటిబాడీ టెస్టులు

ఎంత మందికి కరోనా వచ్చి.. పోయింది?..త్వరలోనే యాంటిబాడీ టెస్టులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ర్టంలో చాలా మందికి ఇప్పటికే కరోనా వచ్చి పోయిందని భావిస్తున్న హెల్త్ డిపార్ట్​మెంట్.. ఇలా ఎంతమందికి వైరస్ సోకి, తగ్గిపోయిందో తెలుసుకునేందుకు త్వరలోనే ఐజీజీ యాంటిబాడీ టెస్టులు చేయించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇన్​స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) లో టెస్టులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందుకు అవసరమైన మిషన్లు తెప్పించి, టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇస్తోంది. కొత్తగా తెప్పించిన మిషన్లతో రోజుకు కనీసం వెయ్యి మందికి టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఐపీఎం డైరెక్టర్, డాక్టర్ శంకర్ తెలిపారు. ఐపీఎంతోపాటు మరో చోట కూడా ఈ తరహా టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో టెస్టులు ప్రారంభిస్తామని వివరించారు.

టెస్ట్ ఎట్ల చేస్తరు?

కరోనా శరీరంలోకి ప్రవేశించగానే దానితో మన రోగ నిరోధక శక్తి పోరాడుతుంది. వైరస్‌‌‌‌‌‌‌‌ సోకిన నాలుగైదు రోజుల తర్వాత యాంటిబాడీస్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి అవుతాయి. ఇవే వైరస్‌‌‌‌‌‌‌‌ను నాశనం చేసేందుకు కొట్లాడుతాయి. ఇలా ముందుగా ఉత్పత్తి అయ్యే యాంటిబాడీస్‌‌‌‌‌‌‌‌ను ‘ఐజీఎం యాంటిబాడీస్‌‌‌‌‌‌‌‌’ అని పిలుస్తారు. ఇవి 22 రోజుల వరకు శరీరంలో ఉంటాయి. 22 రోజుల తర్వాత ఐజీజీ యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆర్నెల్ల వరకు శరీరంలో ఉంటాయి. రక్తంలోని సీరంను టెస్ట్ చేయడం ద్వారా ఐజీఎం, ఐజీజీ యాంటిబాడీస్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఒకే టెస్టుతో రెండింటినీ పరీక్షించొచ్చు. టెస్టులో ఐజీఎం యాంటిబాడీస్ మాత్రమే ఉన్నట్లు తేలితే.. వైరస్ సోకి పది రోజుల్లోపే అవుతున్నట్లు భావిస్తారు. ఐజీఎం, ఐజీజీ రెండూ ఉన్నట్లు తేలితే వైరస్ సోకి10 నుంచి 25 రోజులు అవుతున్నట్టు లెక్క. కేవలం ఐజీజీ యాంటిబాడీస్ మాత్రమే వస్తే వైరస్ వచ్చి, పూర్తిగా నయమైపోయినట్టు భావించాలి.

ముందుగా వారియర్స్‌‌‌‌‌‌‌‌కే

యాంటిబాడీ టెస్టులు ముందుగా డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌, పోలీసులు, శానిటేషన్ వర్కర్స్, జర్నలిస్టులకు చేయించాలని భావిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, డయాబెటిస్, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి టెస్టులు చేయించే చాన్స్​ ఉందని తెలిపారు. ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌లతో వైరస్ వ్యాప్తి ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ తరహా టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ కూడా ఇటీవల అన్ని రాష్ర్టాలకు సూచించింది.