- అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారీ
- కార్వాన్లో వ్యక్తి గుట్టురట్టు
మెహిదీపట్నం, వెలుగు: సిటీలో మరో కల్తీ వ్యాపారం గుట్టురట్టైంది. కార్వాన్ పరిధిలోని కేడీ కాలనీలో అహ్మద్ రజా అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్రతమైన వాతావరణంలో తక్కువ నాణ్యత, కల్తీ ముడి పదార్థాలను వాడుతూ ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బట్టర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫేలు, బేకరీలకు సరఫరా చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు.
పక్కా సమాచారంతో అతడి గోదాంపై గోల్కొండ టాస్క్ ఫోర్స్ టీమ్, గుడిమల్కాపూర్ పోలీసులు కలిసి దాడి చేశారు. రూ. 12.54 లక్షల విలువైన 120కి పైగా పిండి, చక్కెర బస్తాలు, కల్తీ నెయ్యి, నూనెలు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అందె శ్రీనివాసరావు తెలిపారు.
