మత్తు వదిలించు కోవడానికి మైదానంలోకి రమ్మంటున్నాం : మంత్రి వాకిటి శ్రీహరి

మత్తు వదిలించు కోవడానికి మైదానంలోకి రమ్మంటున్నాం : మంత్రి వాకిటి  శ్రీహరి
  • కేటీఆర్‌‌కు మంత్రి శ్రీహరి కౌంటర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల వేళ ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గట్టి కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.‘‘అసెంబ్లీలో సీరియస్ చర్చలు జరుగుతుంటే ఈ ఆటలేంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 

నిజానికి మత్తు వదిలించుకోవడానికే వారిని మైదానంలోకి రమ్మంటున్నాం’’ అని మంత్రి ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఆడే గేమ్స్ వేరని, తాము నిర్వహించే క్రీడలు వేరని పేర్కొంటూ.. ‘‘మా గేమ్స్ వేరు.. కేటీఆర్ గేమ్స్ వేరు. అందుకే మేం పెట్టే ఆటలకు వారు రారు. అలా అని వారు ఆడే ‘గేమ్స్’ ఆడటం మా వల్ల కాదు’’ అని సెటైర్లు వేశారు. ‘ఆరోగ్య తెలంగాణ.. ఫిట్‌నెస్ తెలంగాణ’ లక్ష్యంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.