హైపవర్ మందులకు చావని బ్యాక్టీరియా.. యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వాడటమే కారణం

హైపవర్ మందులకు చావని బ్యాక్టీరియా.. యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వాడటమే కారణం

దేశంలో యాంటీబయాటిక్స్​ ఎమర్జెన్సీ వచ్చే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మెడికల్​ షాపుల్లో ప్రిస్క్రిప్షన్​ లేకుండా విచ్చలవిడిగా మందులు అమ్మేయడం.. కోళ్ల పెరుగుదల కోసం ఫారాల్లో వాడేయడం.. పాల ఉత్పత్తిలోనూ వాటి వాడకం పెరిగిపోతుండడంతో బ్యాక్టీరియాలు మందులకు లొంగకుండా తయారవుతున్నాయి. ఇదే ప్రమాదమనుకుంటే.. ఇప్పుడు మనుషుల్లోనూ మందులకు లొంగని ఆ మొండి బ్యాక్టీరియాలు చేరిపోతున్నాయి. అవును, హైదరాబాద్​లోని ప్రముఖ ఆస్పత్రి ఏషియన్​ఇన్​స్టిట్యూట్​ఆఫ్​గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చేసిన గ్లోబల్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. 

మన దేశంలోని 83 శాతం మంది రోగుల్లో మందులకు లొంగని బ్యాక్టీరియా (మల్టీడ్రగ్​ రెసిస్టెన్స్​ ఆర్గనిజమ్స్​)ను ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. ఎండోస్కోపిక్​ రెట్రోగ్రేడ్​ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్​సీపీ– లివర్​, పాంక్రియాటిక్​ జబ్బులతో బాధపడే) రోగుల్లో ఈ మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా.. మన దేశంలోనే అలాంటి బ్యాక్టీరియాల బారిన పడినోళ్లు ఎక్కువున్నట్టు ఏఐజీ స్టడీ హెచ్చరించింది. 

ఏఐజీ స్టడీలో భాగంగా ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్​కు చెందిన వారి శాంపిళ్లనూ పరీక్షించారు. ఇందులో మన దేశ రోగుల్లో 83 శాతం మందిలో మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత ఇటలీకి చెందిన 31.5 శాతం మంది, అమెరికాకు చెందిన 20.1 శాతం మందిలో వాటి ప్రభావం ఉన్నట్టు తేల్చారు. అత్యల్పంగా నెదర్లాండ్స్​లో 10 శాతం మందిపైనే ఆ మొండి బ్యాక్టీరియా ప్రభావం ఉందని గుర్తించారు. 

హై పవర్​ మందులు వాడినా లొంగట్లేదు..

ఎన్ని యాంటీ బయాటిక్​లు వాడినా ప్రయోజనం లేదనుకున్న సందర్భంలో.. చివరి అస్త్రంగా హైపవర్​ లేటెస్ట్​ యాంటీ బయాటిక్స్ వాడినా కొన్ని బ్యాక్టీరియాలు లొంగడం లేదని స్టడీలో తేల్చారు. అలాంటి రకాలే ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా న్యుమోనియా, కార్బాపీనమ్​ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా అని  నిర్ధారించారు. 

70 శాతం మందిలో ఈ ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లుండగా.. మరో 28 శాతం మందిలో కార్బాపీనమ్​ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా ఉందని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి హైఎండ్​ యాంటీబయాటిక్స్​కు కూడా లొంగడం లేదని, వాటిని ట్రీట్​ చేయడం కష్టతరమవుతుందని, పేషెంట్​ కోలుకోవడానికీ ఎక్కువ సమయం పడుతుందని, కాంప్లికేషన్స్​ ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.