ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!

ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!

హైదరాబాద్, వెలుగు :  తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది. గురువారం సమావేశం నిర్వహిస్తున్నామని, హాజరు కావాల్సిందిగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. అయితే, సమావేశానికి హాజరుకాలేమని రెండు రాష్ట్రాలు కేఆర్​ఎంబీకి లెటర్ రాసినట్టు తెలిసింది. తెలంగాణ ఈఎన్​సీ (జనరల్) లీవ్​లో ఉండడంతో సమావేశానికి హాజరుకాలేమని లేఖ రాసినట్టు సమాచారం. తెలంగాణ హాజరు కాకపోతుండటంతో తాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్​ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టు తెలుస్తున్నది. రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్​ఎంబీ లెటర్ రాయనున్నట్టు తెలుస్తున్నది.

12 టీఎంసీలు అడుగుతున్న తెలంగాణ

ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ ఓవర్ జలాల్లో 27 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉన్నదని, అందులో నుంచి తాగేందుకు నీళ్లివ్వాలని కోరుతూ గత నెలలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేఆర్​ఎంబీకి లేఖ రాశారు. అయితే, తెలంగాణ వాటా నీళ్లను వాడుకున్నదని పేర్కొంటూ బోర్డు రిప్లై ఇచ్చింది. మరోవైపు ఈ నెల 8వ తేదీ నుంచి 5 టీఎంసీల నీళ్లను విడతలవారీగా విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేఆర్​ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసినా.. రాలేమంటూ 2 రాష్ట్రాలు సమాధానమిచ్చాయి. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.