త్వరలో పోలవరం-బనకచర్లకు టెండర్లు : సీఎం చంద్రబాబు

త్వరలో పోలవరం-బనకచర్లకు టెండర్లు : సీఎం చంద్రబాబు
  • అటవీ, పర్యావరణ అనుమతులు అనుకున్న టైంలో కంప్లీట్ చేయాలి 
  • ఏపీ జల వనరుల శాఖ అధికారులకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: త్వరలో పోలవరం– బనకచర్లకు టెండర్లు ఆహ్వానిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితర అంశాలన్నీ అనుకున్న సమయానికి జరగాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం– - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని ఉన్నతాధికారులకు వివరించారు. 

శుక్రవారం అమరావతిలోని సెక్రటేరియెట్‌‌లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం వంటి అంశాలన్నీ జూన్ చివరికల్లా పూర్తవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ఆర్థిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఏపీ ప్రతిపాదనలు పంపించిందన్నారు.