
- అమరావతి నిర్మాణానికి నిధులు, ఏపీకి ఆర్థిక సాయంపై చర్చ
- కేంద్ర హోం, జలశక్తి మంత్రులకుఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు. అమిత్ షాతో దాదాపు 40 నిమిషాలు భేటీ అయ్యారు. ఇందులో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్, బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం సహా పలు అంశాలు వివరించారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. మరింత సహకారం అందించాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సానా సతీశ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టి.కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీలు కె.రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
బనకచర్లతే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు
పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను చంద్రబాబు కోరారు. పాటిల్తో నీటి పారుదల శాఖకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి వివరించి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటామని తెలిపారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని పేర్కొన్నారు.
పూర్వోదయ స్కీమ్ కింద నిధులు ఇవ్వండి
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి చంద్రబాబు వినతిపత్రం సమర్పించారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్దికి దోహదం చేసేలా ఈ స్కీమ్ కింద భారీగా నిధులు ఇవ్వాలని కోరారు.