గవర్నమెంట్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోవాలి

గవర్నమెంట్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోవాలి

అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి  ఆ దిశగా చర్యలు చేపట్టారు. శనివారం సీఎం క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖ అధికారులతో సమావేశమైన జగన్..  తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డ్స్‌  మొదలగు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వీటితోపాటు అదనపు తరగతి గదులనూ నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని 98శాతం పాఠశాలలు అనగా మొత్తం 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ, దాదాపు 10.88 లక్షల ఫొటోలను సంబంధిత వెబ్ సైట్ లో అప్‌లోడ్‌ చేసింది.  అన్ని సదుపాయాలూ కల్పించిన తర్వాతనే మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలన్నారు ముఖ్యమంత్రి జగన్.

కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్‌ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో.. ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్‌ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని అధికారులకు తెలిపారు. ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్‌ సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు.