- అదింకా ప్రతిపాదనల దశలోనే ఉంది.. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
- నర్మదా, కావేరి ట్రిబ్యునళ్లు ఔట్సైడ్ బేసిన్కు నీళ్లు కేటాయించినయ్
- కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు కేంద్రం నదుల అనుసంధానం చేస్తున్నది
- రాయలసీమకు నీటిని తరలించడం అనివార్యమని వాదన
హైదరాబాద్, వెలుగు: పెన్నా బేసిన్కు నీటిని తీసుకెళ్లాలంటే పోలవరం ఆధారంగా చేపట్టాలనుకుంటున్న పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్ట్ అనివార్యమని, మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ తేల్చి చెప్పింది. అయితే, ప్రస్తుతం ఆ ప్రాజెక్టే లేదని, అక్కడి నుంచి నీళ్లు కూడా తీసుకెళ్లడం లేదని, సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్కు కూడా అనుమతి ఇంకా రాలేదని తెలిపింది. కేవలం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
బుధవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (బ్రజేశ్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తన వాదనలను పున:ప్రారంభించింది. ఏపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. కృష్ణా నుంచి ఔట్సైడ్ బేసిన్కు నీటిని తరలించొద్దంటూ తెలంగాణ వాదిస్తున్నదని, అయితే, నర్మదా, కావేరి నదుల విషయంలో ఔట్సైడ్ బేసిన్కు నీటిని తరలిస్తున్నారని వివరించారు. అసలు నదీ ప్రవాహమే లేని ప్రాంతాలకూ నర్మదా కేటాయింపులు ఇచ్చారన్నారు. గ్రాండ్ ఆనకట్ట కింద 45 వేల ఎకరాలు ఔట్సైడ్ బేసిన్లోనే ఉన్నా.. కావేరి ట్రిబ్యునల్ నీటిని కేటాయించిందని తెలిపారు.
దీనికి కర్నాటక అభ్యంతరం చెప్పినా కావేరి ట్రిబ్యునల్ తిరస్కరించిందని గుర్తు చేశారు. బెంగళూరు సిటీ ఔట్సైడ్ బేసిన్లో ఉందన్న కారణంతో కావేరి ట్రిబ్యునల్ నీటిని కేటాయించలేదని, కానీ, ఆ తర్వాత సుప్రీంకోర్టు తాగునీటి కోసం నీటిని ఇవ్వొచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. కరువు ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వాదించారు. డెల్టా ప్రాంతం బేసిన్కు అవతలే ఉన్నా.. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. హెల్సింకీ రూల్స్గానీ.. బెర్లిన్ రూల్స్గానీ ఔట్సైడ్ బేసిన్ కు నీటి కేటాయింపులను నివారించలేవన్నారు.
నదుల అనుసంధానం చేస్తున్నరు కదా..
దేశంలోని పలు ప్రాంతాలు కరువు గుప్పిట్లో ఉంటే.. మరికొన్ని ప్రాంతాలు మాత్రం నీటితో కళకళలాడుతున్నాయని ఏపీ వాదించింది. ఈ క్రమంలోనే కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపట్టింది కదా.. అని ప్రశ్నించింది. పెన్నా బేసిన్లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందని.. జాతీయ దృక్పథంతో నీటి కేటాయింపులను చేపట్టాలని నేషనల్ వాటర్ పాలసీ 2002 కూడా స్పష్టం చేసిందని పేర్కొంది. అందుకే కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపట్టిందని తెలిపింది.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఔట్సైడ్ బేసిన్కు నీటి తరలింపులు అనివార్యమని వాదించింది. అలాగే కృష్ణా నుంచి తమకు సహజంగానే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయని, ఎత్తు మీదున్న తెలంగాణకు లిఫ్ట్లు తప్పనిసరి అని తెలిపింది. ఏపీలో ఔట్సైడ్బేసిన్కు నీటిని తరలించడం వల్ల అక్కడి ప్రజల స్థితిగతులు మెరుగయ్యాయని తెలిపింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్లలో తెలంగాణ ఎప్పుడూ ఓ పార్టీగా లేదని.. కానీ, అవార్డ్స్ మాత్రం తెలంగాణకూ వర్తిస్తాయని పేర్కొంది.
