కియ తరలింపు అబద్ధం.. తప్పుడు కథనాలపై చర్యలు తీసుకుంటాం

కియ తరలింపు అబద్ధం.. తప్పుడు కథనాలపై చర్యలు తీసుకుంటాం

అమరావతి: ‘కియ’ పరిశ్రమ తరలింపు వార్తలను ఏపీ సర్కార్ ఖండించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తాను కంపెనీ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చెప్పారు. కియ ఏపీ నుంచి వెళ్లిపోతోందంటూ వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. ‘కియ’ పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు.

ఓర్చుకోలేక కొంతమంది అబద్ధపు కథనాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు బుగ్గన. తాజాగా విశాఖపట్నం నుంచి మరో కంపెనీ తరలిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఆ వార్త కూడా తప్పేనన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవలసిన సమయమిదని తెలిపారు. తమ ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తోందని, గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు.