హైదరాబాద్, వెలుగు:పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపునకు చేపట్టాల్సిన జాయింట్ సర్వేపై ఏపీ సర్కార్ పూటకోమాట చెప్తోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలతో జాయింట్ సర్వేకు ఓకే చెప్పిన ఏపీ.. ఇదే అంశంపై బుధవారం నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్లో అందుకు విరుద్ధంగా మాట్లాడింది. ‘ తెలంగాణకు అనుకూలమైన నివేదిక వచ్చే వరకు సర్వే చేయాలా..’ అంటూ ఏపీ వాటర్ రిసోర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. పోలవరంలో ఎఫ్ఆర్ఎల్కు, బ్యాక్ వాటర్కు సంబంధమే లేదని ఉల్టాపల్టా మాట్లాడారు. ఇరిగేషన్కు సంబంధించిన ఇంటర్ స్టేట్ ఇష్యూలపైనా ఏపీ కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్కు ఒకలా.. సమావేశాల్లో ఇంకోలా మాట్లాడటం పరిపాటిగా మారింది. పోలవరంతో భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని తమ స్టడీలో తేలిందని, దీనిపై జాయింట్ సర్వే చేసి ముంపును నిర్ధారించాలని పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టుబట్టింది. కానీ, ఏపీ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానికి అన్ని అనుమతులు రావడం అంటే పిల్ల చేష్టలు కాదు కదా అని ప్రశ్నించింది. ముంపుపై ఇప్పటికే సర్వే చేశామని, మళ్లీ చేయాల్సిన అవసరమే లేదని ఎదురుదాడి చేసింది.
ముంపు ప్రభావాన్ని వివరించిన తెలంగాణ
పోలవరంలో 150 అడుగుల (ఎఫ్ఆర్ఎల్) లెవల్లో నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో ముంపు ప్రభావంతో పాటు కిన్నెరసాని నది, ముర్రేడువాగులపై ఎంత ప్రభావం చూపుతుందో నిర్ధారించేందుకు ఏపీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 18న ఒక కమిటీ ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ సర్కిల్ ఎస్ఈ నర్సింహమూర్తి ఈమేరకు భద్రాచలం ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈకి లేఖ రాశారు. పోలవరం హెడ్ వర్క్స్ డివిజన్ - 3 ఈఈ మల్లికార్జునరావు నేతృత్వంలోని కమిటీలో పోలవరం డీఈఈ దామోదరం, ఏఈ పద్మకుమార్, జంగారెడ్డిగూడెం డీఈ పుల్లారావు, జంగారెడ్డిగూడెం ఏఈఈ పరంధామం సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ, తెలంగాణ ఇంజినీర్లతో కలిసి ఈ నెల 10న సమావేశమైంది. తర్వాతి రోజు ఫీల్డ్ విజిట్ చేశారు. పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిలిపితే బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు, మోతె, ఈరవెండి, అశ్వాపురం మండలం ఆనందపురం, పాల్వంచ మండలం సీతారామనగరం, దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామాల్లో 892 ఎకరాలు మునిగిపోతాయని రాష్ట్ర ఇంజినీర్లు వివరించారు. భద్రాచలంలోని విస్టా కాంప్లెక్స్, కొత్తకాలనీ తదితర ప్రాంతాలు మునిగే ఉంటాయని తెలిపారు. కిన్నెరసాని నది, ముర్రేడువాగుల నీళ్లు గోదావరిలో కలువకుండా వెనక్కి తంతాయని, దీంతో పరిసర ప్రాంతాల్లోముంపు ఉంటుందని తెలిపారు. కాగా, పోలవరంపై జాయింట్ సర్వే అవసరమే లేదని ఏపీ వాదించింది.
పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్ ఇప్పించండి
తమకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పించాలని ఏపీ సర్కార్ కోరింది. గురువారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి లెటర్ రాశారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ను అతిక్రమించి తెలంగాణ రాష్ట్రం, పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టిందని నారాయణ రెడ్డి తన లేఖలో ఆరోపించారు. దీనిపై తాము అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. తిరువనంతపురంలో జరిగిన మీటింగ్లో ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేఆర్ఎంబీకి డీపీఆర్ సమర్పించినట్లు తెలంగాణ వెల్లడించిందన్నారు. ఆ డీపీఆర్ కాపీని వెంటనే తమకు పంపాలని విజ్ఞప్తి చేశారు.