కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఎఫెక్ట్ తో దేశమంతా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమై ఉండాలని ప్రధానమంత్రి సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పదేపదే కోరుతున్నారు. నిత్యవసరాలు, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయినా వినకుండా కొందరు ఏ పనీ లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. దీని వల్ల అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వాళ్లు కూడా ఇబ్బందిపడుతున్నారు. అక్కడక్కడా పేదలకు సాయం చేద్దామని బయటకు వెళ్లే వాళ్లకూ లాఠీ దెబ్బలుపడుతున్నాయి. దీంతో అత్యవసరంగా బయటకు వెళ్లే వారికి సమస్య లేకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం చేయించుకోవడం కోసం, స్వచ్ఛంద సేవ చేసేవాళ్లు, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్లు, ఇతరత్రా సమస్యలతో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారికి కోవిడ్-19 ఎమర్జెన్సీ పాసులను జారీ చేసేందుకు సిద్ధమైంది.
అత్యవసర ప్రయాణాలకు పాసులు తీసుకోవడం ఇలా..
లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నందున అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు ఇబ్బందులు పడకుండా పాసులు జారీ చేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఏపీ డీజీపీ ఆఫీస్ వెల్లడించింది. పాసులు అవసరమైనవారు.. పేరు, అడ్రస్, ఆధార్ కార్డు, వారు ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను అందజేస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పాస్ జారీ అవుతుందని తెలిపింది. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి పాస్ కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసు శాఖ హెచ్చరించింది. పాస్ ల కోసం వివరాలను పంపి అప్లై చేసుకోవాల్సిన జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలను వెల్లడించింది. ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఎస్పీ వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన పాసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వార్డ్ చేసుకుని ఇతరులు వాడుకునేందుకు వీలుకాదని స్పష్టం చేసింది.