‘బనకచర్ల’తో భారీ కుట్రలకు తెరలేపిన ఏపీ.. ఇటు నాగార్జునసాగర్.. అటు శ్రీశైలం నుంచీ దోపిడీకి స్కెచ్

‘బనకచర్ల’తో భారీ కుట్రలకు తెరలేపిన ఏపీ..  ఇటు నాగార్జునసాగర్.. అటు శ్రీశైలం నుంచీ దోపిడీకి స్కెచ్
  • పేరుకే గోదావరి..  కృష్ణా నీళ్లకు సూటి!
  • గోదావరిలో మిగులు జలాలే లేవంటున్న ఎన్​డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ
  • అయినా పదే పదే మిగులు జలాల పాట పాడుతున్న ఏపీ
  • ప్రాజెక్టు పేరు, ప్లాన్​లో పలు మార్పులు.. జీబీ లింక్​ ఇకపై పీబీ లింక్​గా 
  • బొల్లాపల్లి రిజర్వాయర్​ సామర్థ్యం 150 నుంచి 173 టీఎంసీలకు పెంపు
  • ఆ రిజర్వాయర్​ నుంచే ‘సాగర్​ ప్రాజెక్ట్​ ఫేజ్​2’ కూ లింక్​
  • బొల్లాపల్లి తర్వాత ఓ చెరువును తవ్వించేందుకు ప్లాన్​
  • లోయర్​ గోదావరిలో మిగులు జలాలు లేవని ఎన్​డబ్ల్యూడీఏ తేల్చినా.. నీళ్లున్నట్టు పీఎఫ్​ఆర్​లో ఏపీ వాదన

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి నదిలోని మిగులు జలాలనే వాడుకుంటామని ఏపీ చెప్తున్నా.. ఆ పేరుతో కృష్ణా నీళ్లకే ఎసరు పెడుతున్నది. అందుకు తగ్గట్టుగా ప్రాజెక్టు  కోసం ముందు అనుకున్న ప్లాన్​లో పలు మార్పులు చేసింది. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను వాడుకుంటామని, తెలంగాణ కూడా వాడుకోవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నా.. ఆ మాటల వెనుక కృష్ణా నీళ్లకు సూటి పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు.. దాని పేరుతో లిఫ్టులు కట్టి బనకచర్ల వరకు తరలించాలనుకోవడం ఏమిటని మన నీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

గోదావరిలో మిగులు జలాలు లేకపోగా లోటు ఉందని సెంట్రల్​ వాటర్​ కమిషన్​, నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ కూడా పదే పదే చెప్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్​ సర్కార్​ మాత్రం మళ్లీ మళ్లీ మిగులు జలాల పాటనే పాడుతున్నది.  ఇప్పటికే రాయలసీమ నీటి కోసం శ్రీశైలానికి భారీ గండ్లు కొట్టిన ఏపీ.. ఇప్పుడు నాగార్జునసాగర్​కూ గండి కొట్టే ప్రయత్నాలకు తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే కృష్ణా నదిలో ఇటు సాగర్​, అటు శ్రీశైలం నుంచి నీళ్ల దోపిడీకి భారీగానే స్కెచ్​ వేసిందనే చర్చ జరుగుతున్నది. 

బనకచర్ల ప్లాన్​లో మార్పులు

కృష్ణా జలాలకు సూటి పెట్టేందుకు జీబీ లింకు ప్రాజెక్టులో ఏపీ పలు మార్పులు చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. తొలుత ప్రాజెక్ట్​ పేరును మార్చేసింది. గోదావరి – బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్లిన ఏపీ.. ఇప్పుడు దాన్ని పోలవరం – బనకచర్ల (పీబీ) లింక్​ ప్రాజెక్ట్​గా మార్చింది. ఇటీవల కేంద్రానికి సమర్పించిన ప్రాజెక్ట్​ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​)లోనూ మార్పులు చేర్పులు చేసింది. నికరజలాలు కాదు.. పోలవరం దిగువన వరద జలాల నుంచే ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్​ చేస్తామని చెప్తున్నది. 

అంతేకాదు.. ఈ పీబీ లింక్​లో అత్యంత కీలకమైన బొల్లాపల్లి రిజర్వాయర్​ కెపాసిటీని కూడా ఏపీ పెంచింది. తొలుత రిజర్వాయర్​ కెపాసిటీని 150 టీఎంసీలుగానే ప్రతిపాదించిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు దానిని 173 టీఎంసీలకు పెంచింది. అందులో 152 టీఎంసీలను లైవ్​ స్టోరేజీగా వాడుకోనుంది. మరో 21 టీఎంసీలను క్యారీ ఓవర్​ (డెడ్​) స్టోరేజీగా పేర్కొంది. ఇక్కడే ఏపీ తొండి బయటపడింది. ఇక ఈ బొల్లాపల్లి రిజర్వాయర్​ నుంచి బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​కు నీటిని తరలించే ప్లాన్​లోనూ మార్పులు చేసింది. తొలుత టైగర్​ రిజర్వ్​ ఉన్న నల్లమల కొండల కింద నుంచి 34 కిలోమీటర్ల దూరానికి టన్నెల్​ బోరింగ్​ మెషీన్ల ద్వారా సొరంగాలు తవ్వాలని ఏపీ భావించింది. కానీ, పీఎఫ్​ఆర్​లో దానికి ఆల్టర్నేటివ్​నూ ప్రతిపాదించింది. టైగర్​ రిజర్వ్​ సరిహద్దులు దాటగానే టన్నెల్​ తవ్వాలని భావిస్తున్నది. 

తద్వారా సొరంగం దూరాన్ని 19.5 కిలోమీటర్లకు తగ్గించనుంది. అందుకు ఈ సొరంగం ప్రారంభానికి ముందు ఓ చెరువును నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత టన్నెల్​కు చివరన ఉన్న సిద్ధాపురం ట్యాంక్​కు నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నది. అక్కడి నుంచి మరో 6.6 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వి బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​కు నీటిని తరలించేందుకు ప్లాన్​ చేస్తున్నది. ఈ రెండింటి మధ్య అర టీఎంసీ నీటిని క్యారీ చేసే ఓ లింక్​ కెనాల్​ను 11.10 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. మొత్తంగా ప్రాజెక్టు ఖర్చును కూడా ఏపీ పెంచి చూపించింది. తొలుత రూ.80,112 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పిన ఏపీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్​ అంచనా వ్యయాన్ని రూ.81,900 కోట్లకు పెంచింది.  అంటే రూ.1800 కోట్ల మేర వ్యయాన్ని సవరించింది. 

సాగర్​ ఫేజ్​ 2తో లింక్​

పీబీ లింక్​తో నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ ఫేజ్​2ను ఏపీ అనుసంధానం చేస్తున్నది. ఫేజ్​ 2 ద్వారా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 4.20 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వాస్తవానికి ఎన్నో ఏండ్ల నుంచి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పడు బొల్లాపల్లి రిజర్వాయర్​ ద్వారా సాగర్​ ప్రాజెక్ట్​ ఫేజ్​2ను లింక్​ చేస్తే.. అక్కడికి కూడా నీళ్లివ్వొచ్చని భావిస్తున్నది. బొల్లాపల్లి రిజర్వాయర్​ నుంచి కాల్వలు తవ్వి కేవలం గ్రావిటీ ద్వారా ఆయా జిల్లాలకు నీళ్లిచ్చేందుకు ప్లాన్​ చేసింది. ఇక్కడ వాడుకునేది గోదావరి జలాలా లేదంటే కృష్ణా జలాలా అన్నది తేల్చడం కష్టమని ఇరిగేషన్​ నిపుణులు అంటున్నారు. 

కుడి కాల్వకూ లింక్​ చేసి..

పోలవరం నుంచి ఇప్పటికే కృష్ణా డెల్టాకు నీటిని  ఏపీ తరలిస్తున్నది. పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసుకుంటున్నది. 80 టీఎంసీలను తరలిస్తుండగా.. అందులో ఏపీకి 45, కర్నాటకకు 24, మహారాష్ట్రకు 11 టీఎంసీలు ఇస్తున్నారు. అయితే, ఏపీ వాడుకునే 45 టీఎంసీలకు సమానంగా.. నాగార్జునసాగర్​కు ఎగువన మనకు 45 టీఎంసీలు కేటాయించాల్సి ఉన్నా ఇప్పటికీ ఏపీ మన వాటాపై కొర్రీలు పెడుతూనే ఉన్నది. ఇప్పుడు పీబీ లింక్​ పేరిట.. కృష్ణా నదికి కలిపేసి.. సాగర్​ కుడి కాల్వను పెద్దది చేసి నీటిని ఎత్తిపోసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో కుడికాల్వలోకి ఎత్తిపోసే నీళ్లు గోదావరివా.. లేదంటే కృష్ణావా (సాగర్​ నుంచి వచ్చేటివి) అన్న లెక్కలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇరిగేషన్​ ఎక్స్​పర్ట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


సాగర్​ నుంచి మనకు వచ్చేది అంతంతే..!

ఆంధ్రప్రదేశ్​ ఒకవేళ తన ప్లాన్​ను అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్తే.. భవిష్యత్​లో మనకు నాగార్జునసాగర్​ నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇప్పటికే కుడి కాల్వ ద్వారా ఎడాపెడా జలదోపిడీకి తెరదీస్తున్న ఏపీకి.. పీబీ లింక్​ ఓకే అయితే మరింత దోచుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఇరిగేషన్​ నిపుణులు అంటున్నారు. దీంతో సాగర్​ డ్యామ్​కు ఎక్కడో దూరంగా ఉండే  ఎడమ కాల్వ హెడ్ ​రెగ్యులేటర్​కు నీళ్లు అందని పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్​లో 510 అడుగుల దిగువకు నీళ్లు వెళ్తే మనం మోటార్లు పెట్టి తోడుకోవాల్సి వస్తున్నది. అదే.. పీబీ లింక్​తో సాగర్​ కుడి కాల్వను కలిపి నీటిని ఏపీ తీసుకెళ్తే వాళ్ల దోపిడీ పీక్స్​కు పోతుంది. అప్పుడు మనం మోటార్లు పెట్టినా నీళ్లు తోడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


అసలు మిగులు జలాలే లేవ్​..

గోదావరి బేసిన్​లో మిగులు జలాలే లేవని సెం ట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ), నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ)తేల్చిచెప్పాయి. శబరి, ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప ఎక్కడా మిగులు జలాలు లేవని ఎన్​డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. సబ్ ​బేసిన్లయిన శబరిలో 319 టీఎంసీలు, ఇంద్రావతిలో 292 టీఎంసీలు, ప్రాణహితలో 180 టీఎంసీల చొప్పున మాత్రమే మిగులు జలాలున్నాయని తేల్చింది. మిగితా లోయర్​ గోదావరిలోగానీ, వార్ధా, పెన్​గంగ, మానేరు, మిడిల్​ గోదావరి సహా ఎక్కడా మిగులు జలాలు లేవని, పైగా లోటు ఉన్నదని స్పష్టంగా పేర్కొంది. 

గోదావరి బేసిన్​తో పాటు వాటి సబ్ ​బేసిన్లనూ కలిపితే 157 టీఎంసీల లోటు ఉన్నట్టు లెక్కలతో తెలి పింది. కానీ, ఏపీ​ మాత్రం లోయర్​ గోదావరి (కాళేశ్వరం)లో మిగులు జలాలున్నట్టుగా పీఎఫ్​ఆర్​లో తప్పుడు రిపోర్టు ఇచ్చింది. ఇంద్రావతి (జీ11), శబరి (జీ12), లోయర్​ గోదావరి (జీ10)లో నీటి లభ్యత ఉన్నట్టు పేర్కొంది.  ఎన్​డబ్ల్యూడీఏ లెక్కల ప్రకారం.. లోయర్​ గోదావరిలో అసలు నీటి లభ్యత అన్నదే లేదు. కేంద్ర సంస్థ లెక్కల ప్రకారం.. లోయర్​ గోదావరిలో 691 టీఎంసీల లోటు ఉన్నట్టు స్పష్టంగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించింది. శబరి, ఇంద్రావతి, లోయర్​ గోదావరిని కలిపినా.. ఏపీకి మిగులు జలాలు ఉండవన్నది స్పష్టమవుతున్నది. 

శబరి, ఇంద్రావతి కలిపి 611 టీఎంసీల మిగులు నీళ్లున్నాయి. దానికి లోయర్​ గోదావరిని కలిపితే.. 80 టీఎంసీల లోటు స్పష్టంగా తేలుతున్నది. అలాంటప్పుడు ఏపీకి ఈ మూడు సబ్​బేసిన్ల ద్వారా మిగులు జలాలు ఎక్కడి నుం చి వస్తాయన్నది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే పీబీ లింక్​ పేరిట.. ఇటు ప్రకాశం బ్యారేజీ, అటు సాగర్​ కుడి కాల్వ నుంచి నీటిని దొడ్డిదారిలో తీసుకెళ్లాలన్న కుట్రలకు ఏపీ తెరదీస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా 200 టీఎంసీలే లిఫ్ట్​ చేస్తామని చెప్తున్నా.. పీఎఫ్​ఆర్​లో మాత్రం 231 టీఎంసీలు తీసుకుపోవచ్చని ఏపీ చెప్తున్నది.  భవిష్యత్​లో దానిని 400 టీఎంసీలకూ పెంచుకునేలా ముందుకు కదులుతున్నది. 

ఇప్పటికే  శ్రీశైలానికి భారీ గండ్లు

ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ గండ్లు పెట్టి రాయలసీమకు నీటిని తరలి స్తున్న ఏపీ ప్రభుత్వం.. పీబీ లింక్​తో ఇటు నాగార్జునసాగర్​కూ ఎసరు పెడుతు న్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ గేట్లను 14కు పెంచడంతో పాటు దాని కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్నది. అక్కడి నుంచి శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​ ద్వారా రోజూ 9 టీఎంసీలు తరలించుకెళ్లేలా ఆ కెనాల్​కు లైనింగ్​ పనులనూ కానిచ్చేస్తున్నది. 

అక్కడి నుంచి బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​లో పోసి శ్రీశైలం రైట్​ బ్యాంక్​ కెనాల్​, గాలేరు నగరి, కేసీ కెనాల్​, తెలుగు గంగ కెనాల్స్​ ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నది. వాటికి తోడుగా రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు ద్వారా మరో 3 టీఎంసీలు తరలించేందుకు ప్లాన్​ చేస్తున్నది. ఆ రెండిం టికి ఇప్పుడు గోదావరి నుంచి రోజూ మరో 3 టీఎంసీలకు బొక్కపెట్టేలా పీబీ లింక్​ను కృష్ణాకు ముడిపెడుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.

కుట్రలను బయటపెట్టిన ‘వెలుగు’

గోదావరి– -బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం చర్యలను మొట్టమొదట ‘వీ6–వెలుగు’ దినపత్రిక బయటకుతెచ్చింది. ‘వెలుగు’ వరుస కథనాలతో మన రాష్ట్ర సర్కారు స్పందించింది. కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకునే వరకు వెళ్లింది. వాస్తవానికి నిరుడు డిసెంబర్​లోనే జీబీ లింక్​ పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించింది. జనవరిలో దానిపై గుట్టుగా పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ రెడీ చేసింది. దీనిపై 2025 జనవరి 5వ తేదీనే ‘బనకచర్లతో ఏపీ భారీ కుట్ర!’ శీర్షికన ‘వెలుగు’ కథనాన్ని ప్రచురించింది. 

పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల జలదోపిడీకి ఏపీ ఎలా ప్లాన్​ వేసిందో వివరించింది. ఆ తర్వాత అదే నెల 31న ‘గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్​’ పేరిట ఇంకో కథనాన్ని ‘వెలుగు’ ప్రచురించింది. బనకచర్లతో పాటు దానికి సమాంతరంగా గోదావరి నుంచి సోమశిలకు 200 టీఎంసీల నీటిని దోచుకెళ్లే ఏపీ ప్లాన్​ను వెల్లడించింది. ఇక, ఆ మరుసటి నెల అంటే ఫిబ్రవరి 21న ‘రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట’ పేరుతో మరో కథనాన్ని పబ్లిష్​ చేసింది. ఢిల్లీ కేంద్రంగా జీబీ లింక్​ కోసం ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్న కుట్రలను వెలుగులోకి తెచ్చింది. 

గోదావరి మిగులు జలాల చాటున కృష్ణా జలాల దోపిడీకి బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నదో వివరిస్తూ మార్చి 7న ‘కృష్ణా నీటి దోపిడీకే బనకచర్ల’ అనే హెడ్​లైన్​​తో స్పెషల్​ స్టోరీని వెలుగు ప్రచురించింది. ఇక, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం జలహారతి కార్పొరేషన్​ను ఏపీ ఏర్పాటు చేసిన అంశాన్ని వివరిస్తూ ఏప్రిల్​ 10న ‘బనకచర్లపై ఏపీ దూకుడు!’ పేరుతో ఇంకో కథనాన్ని ప్రచురించింది. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇలా ‘వెలుగు’ దినపత్రిక ఎప్పటికప్పుడు అలర్ట్​ చేస్తూనే ఉన్నది. ఏపీ కడుతున్న ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా గండిపడుతుందో హెచ్చరిస్తూనే ఉంది.