
తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల చర్చల వ్యవహారం ముదిరింది. ప్రస్తుతం ఉన్న అద్దె విధానానికి బదులుగా, మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేస్ విధానాన్ని తేవాలనే డిమాండ్, జూన్ 1 న థియేటర్ల బంద్ పిలుపు.. ఇలా పలురకాలుగా సినీ రంగం వేడెక్కింది. అయితే, థియేటర్ల బంద్ నిర్ణయం వెనుకున్నదెవరో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఇటీవలే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు.
సినీ పరిశ్రమ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై లేటెస్ట్గా మంత్రి కందుల దుర్గేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎంతో సహకరిస్తోందని తెలిపారు. కానీ, కొందరి మాటలు అహంభావపూరితంగా ఉన్నాయని, ప్రతిసారీ ఎవరో ఒకరు టికెట్ల ధరలు పెంచమని వస్తున్నారని.. అందుకు మేం ఓకే చేస్తున్నాం. ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటువంటి నిర్ణయాల వల్ల ఆయా అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. అయినా మేం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం రేట్లు పెంపునకు అనుమతిస్తున్నాం అని మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. ఒక సినిమా నిర్మాణం వెనుక చాలామంది రచయితల కృషి ఉంటుంది. అలాంటి సినిమా మీద వందలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇలా సడెన్ గా ఎవరితో చర్చించకుండా థియేటర్స్ బంద్ పెట్టాలనే నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరించారు.
హరిహర వీరమల్లు విడుదల (జూన్ 12) సమయంలోనే ఈ థియేటర్ల బందు అనే విషయం.. ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూపులా ఏర్పడి, ఎవరితో చర్చించి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారో తెలుసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని విచారణ చేయమని కోరానని వెల్లడించారు.
ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రిని కలసి వారి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నేను ఫిలిం ఛాంబర్ కు లేఖ కూడా రాశాను. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందించాలని చూస్తున్నామని లేఖలో వివరంగా రాసానని మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని.. కొంతమంది అహంకార ధోరణి తో మాట్లాడటం మానేసి అధికారులతో చర్చలు జరపాలని మంత్రి కోరారు. ఇటీవలే ఓ మాజీ మంత్రి సినిమా విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా అలా మాట్లాడటం చాలా తప్పు అని మంత్రి కందుల అన్నారు.