మెహిదీపట్నం, వెలుగు: విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. మంగళవారం బీసీ నాయకులు మోడీ రాందేవ్, రాజేందర్, అనంతయ్య, బంగా అఖిల్ ముదిరాజ్, సాయి కిరణ్, జనార్ధన్ తో కలిసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణను కలిసారు. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హైకోర్టు తీర్పుతో చాలా కాలేజీలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. అడ్మిషన్లు, కోర్సు పూర్తయిన తర్వాత ఫీజులు వసూలు చేయవద్దని ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. కోర్టు తీర్పుతో ఫీజులు కట్టి చదువుకునే స్థోమత లేని వారు ఇబ్బంది పడతారని చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలు రూ.10 వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

