- సీబీఎఫ్సీ ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకే అవార్డులు: వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అవార్డు విభాగాలకు తోడు ఈసారి కొత్త విభాగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నామని వివరించారు. అర్హులైన నిర్మాతలు, ఇతరులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను 2026 జనవరి 31 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు వచ్చే నెల 3 వరకు గడువు విధించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
