Asian Para Games 2023: కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టి ఆర్చరీలో స్వర్ణం.. సత్తా చాటిన శీతల్ దేవి

Asian Para Games 2023: కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టి ఆర్చరీలో స్వర్ణం.. సత్తా చాటిన శీతల్ దేవి

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే ఏ పని పాట లేకుండా బలాదూర్ తిరిగే రోజులివి. ఆకలిస్తే ఇతరుల వద్ద చేతులు చాపటం.. నాలుగు మెతుకులు పొట్టలో వేసుకోవటం. ఇదీ వారి దినచర్య. అలాంటి వారందరూ ఈ భారత వనితను చూసి సిగ్గుపడాలి. వైకల్యం శరీరానికే కానీ, ప్రతిభకు కాదు అని నిరూపించింది.. మన శీతల్ దేవి. చేతులు లేకపోయినా కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టి దేశానికి బంగారు పతకాన్ని అందించింది.

చైనా, హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు రాకేష్ కుమార్, శీతల్ దేవి కాంపౌండ్‌ ఓపెన్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో స్వర్ణం సాధించారు. 151-149తో చైనాకు చెందిన యుషాన్ లిన్, జిన్లియాంగ్ ఐలపై విజయం సాధించిన ఈ జంట గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. పారా ఆసియా గేమ్స్‌లో అర్చరీ విభాగంలో  భారత్‌కు ఇదే తొలి స్వర్ణం.

కాళ్లు, పాదాల సాయంతో

శీతల్ జన్మించినప్పుడు ఫోకోమెలియా సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో అవయవాలు అభివృద్ధి చెందవు. అలా అని శీతల్ తనకు చేతులు లేనందుకు బాధపడలేదు అని కాదు. బాధపడింది. కానీ, దాన్ని మరిచిపోయేలా ఏదైనా సాధించాలనుకుంది. ఆర్చరీ వైపు సారించి.. విజయాల బాటలో సాగుతోంది. ఆమె తన కాళ్లు మరియు పాదాల సాయంతో షూట్ చేస్తుంది.