
పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతోందన్నారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. దీనికి తామూ కూడా సిద్ధంగానే ఉన్నామనీ, కనుసైగ చేస్తే తమ బలగాలు దూసుకెళ్తాయని హెచ్చరించారు. అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానాశ్రయంలో మాట్లాడుతూ కాశ్మీరీలు జిహాద్ చేస్తున్నారని, పాకిస్తాన్ వారికి అండగా ఉంటే వారు విజయం సాధిస్తారన్నారు. అది కూడా జిహాదేనన్నారు.
ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్తాన్ దాగుడుమూతలు ఆడుతోందన్నారు.జీహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.ఇలాంటి చర్యలు ఎంతో కాలం సాగవని, మెరుపుదాడులతో భారత్ ఏంటో ఆ దేశానికి ఇప్పటికే తెలిసి వచ్చిందని గుర్తుచేశారు. పాకిస్తాన్ హద్దు మీరి ప్రవర్తిస్తే భారత్ సరిహద్దు దాటడానికి వెనుకడుగు వేయదని హెచ్చరించారు. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసి ఆ దేశానికి సరైన బుద్ధి చెబుతామన్నారు. యుద్ధం జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.