తిరుమలలోని నారాయణ ఉద్యానవనాల్లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 30 మంది, తమిళనాడుకు చెందిన 50 మంది అలంకార నిపుణులు అలంకరిస్తున్నారని టీటీడీ ఉద్యానవన సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. పూణేకు చెందిన దాత రూ.24 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.