కూతురి పెండ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని చంపేసిండు

కూతురి పెండ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని చంపేసిండు
  •    రాంపూర్​యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు
  •     ఏడుగురి అరెస్టు

రామాయంపేట/నిజాంపేట, వెలుగు: మెదక్​జిల్లా నిజాంపేట మండలం రాంపూర్​ గ్రామానికి చెందిన జెల్ల నర్సింలుగౌడ్(28)​ హత్య కేసును పోలీసులు చేధించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు పేట సీఐ  నాగార్జున్​గౌడ్ ​తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. రాంపూర్​గ్రామానికి చెందిన జెల్ల నర్సింలుగౌడ్(28) అదే గ్రామానికి చెందిన యాడారం నాగరాజుగౌడ్​కూతురును ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ మేరకు గత సంవత్సరం అతనిపై నిజాంపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అమ్మాయికి పెండ్లి సంబంధాలు వస్తే వాటిని చెడగొడుతున్నాడని ఈ నెల 19న నర్సింలుగౌడ్ పై నాగరాజుగౌడ్​స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం నాగరాజు గౌడ్ ​గ్రామ శివారులో తాటి చెట్టు ఎక్కగా అటువైపుగా వెళ్తున్న నర్సింలుగౌడ్​ అతనితో గొడవకు దిగాడు. అనంతరం తన పొలం వద్దకు వెళ్లాడు. నాగరాజు గౌడ్​ తన బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. పొలం నుంచి తిరిగివస్తున్న నర్సింలుగౌడ్ ను కట్టెలతో కొట్టారు. పెద్దరాయిని అతనిపై పడేశారు. చనిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం  ఉదయం కల్వకుంట స్టేజి వద్ద యాడారం నాగరాజుగౌడ్​తోపాటు అతనికి సహకరించిన బందారం నాగరాజుగౌడ్, నవీన్​గౌడ్, గణేశ్​గౌడ్ అలియాస్​ ప్రవీన్​గౌడ్, యాడారం రమేశ్​గౌడ్, శేఖర్​గౌడ్, బందారం లక్ష్మన్​ ను పట్టుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఘటనలో ఓ మైనర్​బాలుడు పాల్గొన్నాడని, అతను పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

 

చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ఫేజ్-1 ట్రయల్స్ సక్సెస్