- రాంపూర్యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు
- ఏడుగురి అరెస్టు
రామాయంపేట/నిజాంపేట, వెలుగు: మెదక్జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జెల్ల నర్సింలుగౌడ్(28) హత్య కేసును పోలీసులు చేధించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేట సీఐ నాగార్జున్గౌడ్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. రాంపూర్గ్రామానికి చెందిన జెల్ల నర్సింలుగౌడ్(28) అదే గ్రామానికి చెందిన యాడారం నాగరాజుగౌడ్కూతురును ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ మేరకు గత సంవత్సరం అతనిపై నిజాంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అమ్మాయికి పెండ్లి సంబంధాలు వస్తే వాటిని చెడగొడుతున్నాడని ఈ నెల 19న నర్సింలుగౌడ్ పై నాగరాజుగౌడ్స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం నాగరాజు గౌడ్ గ్రామ శివారులో తాటి చెట్టు ఎక్కగా అటువైపుగా వెళ్తున్న నర్సింలుగౌడ్ అతనితో గొడవకు దిగాడు. అనంతరం తన పొలం వద్దకు వెళ్లాడు. నాగరాజు గౌడ్ తన బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. పొలం నుంచి తిరిగివస్తున్న నర్సింలుగౌడ్ ను కట్టెలతో కొట్టారు. పెద్దరాయిని అతనిపై పడేశారు. చనిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం కల్వకుంట స్టేజి వద్ద యాడారం నాగరాజుగౌడ్తోపాటు అతనికి సహకరించిన బందారం నాగరాజుగౌడ్, నవీన్గౌడ్, గణేశ్గౌడ్ అలియాస్ ప్రవీన్గౌడ్, యాడారం రమేశ్గౌడ్, శేఖర్గౌడ్, బందారం లక్ష్మన్ ను పట్టుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘటనలో ఓ మైనర్బాలుడు పాల్గొన్నాడని, అతను పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.