ఫేక్​ కరెన్సీ తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ 

ఫేక్​ కరెన్సీ తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ 
  • ఫేక్ ​కరెన్సీ, ప్రింటింగ్ మెషీన్, ఇతర సామగ్రి స్వాధీనం

శంషాబాద్, వెలుగు: నకిలీ ఫేక్​కరెన్సీ ప్రింట్​చేసి మార్కెట్ లో చలామని చేస్తున్న ఏపీకి చెందిన ఇద్దరిని శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్​చేశారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్(37), అదే జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు చెందిన మోహన్ రావు(43) శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లి వద్ద ఓ స్టార్ హోటల్​లో ఉంటూ ఫేక్​కరెన్సీ నోట్లను ప్రింట్​చేస్తున్నారు.

సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేసి, వారి నుంచి రూ.8లక్షల55వేల ఫేక్​కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 50, 100, 200, 500 నోట్లను ప్రింట్​చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మూడు ఫోన్లు, ఓ కంప్యూటర్, ప్రింటింగ్ మెషీన్ తోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ చెప్పారు.