చదువుకు తగ్గ ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కన్నాడు అర్ష్ నందన్ ప్రసాద్. అందుకోసం చాలా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఇంటర్వ్యూలో అదరగొట్టినా ఉద్యోగం రాలేదు. కారణం... అతనికి క్యాన్సర్ ఉండడమే. అందరూ ‘నీకు క్యాన్సర్ ఉంది కదా!’అని జాలిపడేవాళ్లే తప్ప, జాబ్ ఇచ్చేవాళ్లు కాదు. అయినా నిరుత్సాహపడలేదు. కీమోథెరపీ చేయించుకుంటూనే జాబ్ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. ఈమధ్య హాస్పిటల్ బెడ్ మీద, ల్యాప్టాప్ ముందు కూర్చొని జాబ్ ఇంటర్వ్యూ ఇస్తున్న ఫొటోను లింక్డిన్లో పెట్టి, ‘నామీద జాలిపడడం కాదు. నా టాలెంట్ని గుర్తించండి’ అన్నాడు నందన్. నందన్ ఐటీ కోర్స్ చేశాడు. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ, క్యాన్సర్ ఆయన కలలకు అడ్డుపడింది. దాంతో, ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే మిగిలింది. అయినా కూడా, జాబ్ తెచ్చుకోవాలన్న తన సంకల్పాన్ని పక్కన పెట్టలేదు. ట్రీట్మెంట్ చేయించుకుంటూ జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లాడు. హాస్పిటల్లోనూ బెడ్ మీద కూర్చొని ఆన్లైన్లో జాబ్ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేవాడు.
వారియర్ అంటూ కామెంట్లు
‘కొన్నిసార్లు ఇంటర్వ్యూ బాగా చేసినా కూడా జాబ్ రాదు. కారణం.. జీవితంలో కష్టమైన పరిస్థితిలో ఉన్న మనల్ని చూసి ఉద్యోగమిచ్చే కంపెనీలు జాలిపడడమే. నాకు క్యాన్సర్ ఉందని తెలిశాక, వాళ్ల ముఖంలో నన్ను సెలక్ట్ చేయొద్దనే ఎక్స్ప్రెషన్ కనిపించేది. నాకు మీ జాలి అవసరం లేదు. నా టాలెంట్ని నిరూపించుకునేందుకే జాబ్ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్న ఈ ఫొటో పెట్టా”అన్నాడు నందన్. ఆ పోస్ట్ వైరల్ అయింది.
జాబ్ ఆఫర్ వచ్చింది
సోషల్మీడియాలో నందన్ పోస్ట్ చూసి చలించి పోయాడు మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఫౌండర్ నీలేశ్. అతనికి జాబ్ ఆఫర్ ఇచ్చాడు. ‘‘ఓ వారియర్.. ఇక జాబ్స్ కోసం ట్రై చేయడం ఆపేయ్. మంచి ట్రీట్మెంట్ తీసుకో. నీకు ఇంటర్వ్యూ లేదు. కోలుకోగానే వచ్చి ఉద్యోగంలో చేరు” అని చెప్పాడు నీలేశ్.