కాశీబుగ్గ, వెలుగు : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గోదాములను కలెక్టర్ పరిశీలించారు. నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
