డిస్పూర్: వ్యక్తిగత వైఫల్యాలను మియా ముస్లింలపై రుద్దుతున్నారని అస్సాం సీఎంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇటీవల అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో పెరుగుతున్న కూరగాయల ధరలకు మియా ముస్లిం(స్థానికంగా ఉండే బెంగాలీ మాట్లాడే ముస్లింలు)లే కారణమంటూ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆయనపై తాజాగా ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి ఇంట్లో గేదెలు పాలివ్వకపోయినా.. కోడి గుడ్డు పెట్టకపోయినా మియా ముస్లింలను తప్పుపట్టే ఓ వర్గం దేశంలో ఉందన్నారు. ఆ రాష్ట్రంలో రిక్షా నడిపేవారి దగ్గర నుంచి ఓలా, ఊబర్ నడిపే డ్రైవర్లంతా మియా ముస్లింలేనని వారు లేకుంటే అస్సాం అసంపూర్ణంగా మిగిలిపోతుందని అన్నారు. అస్సాంలో మియా ముస్లింలు మొదట బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారుగా చెప్తుంటారు.