ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని , అక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అజారుద్దిన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఒవైసీ .. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమేనని చెప్పారు. అజారుద్దిన్ సోదరులు తనకు స్నేహితులన్నారు. ఈ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదని ఒవైసీ నిలదీశారు. పార్టీ చీఫ్ గా బండి సంజయ్ ను తప్పించి ఇప్పుడు బీసీ సీఎం అంటే ఎలా ప్రశ్నించారు. ముందుగా బండి సంజయ్ ను ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లుగా అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఏడు సిట్టింగ్ స్థానాలు (చంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్ పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట్) తో పాటుగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో పోటీ చేస్తున్నట్లుగా ఒవైసీ వెల్లడించారు.
చంద్రాయనగుట్ట నుంచి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్పేట్ నుంచి అహ్మద్ బలాల పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. బహదూర్పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు.
ALSO READ :- చెన్నూరు కాంగ్రెస్ టికెట్ వివేక్ వెంకట స్వామికి ఇవ్వాలి : నల్లాల ఓదేలు