హైదరాబాద్: భారత వాయుసేన సరిహద్దు రేఖ దాటి వెళ్లి పాకిస్థాన్ లోని జైషే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. ఈ దాడిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామన్నారు. పాకిస్థాన్ పై సరైన దెబ్బ పడిందని, పుల్వామా ఘటన జరిగిన రెండు మూడ్రోజుల్లోనే ఈ తరహా ఎయిర్ స్ట్రయిక్ జరగాల్సిందని ఒవైసీ అన్నారు.
యూఎన్ చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం పాక్ పై అటాక్ చేయడం మన హక్కు అని ఆయన చెప్పారు. ఏదైనా దేశం ఉగ్ర మూకలను అరికట్టలేకపోతే.. ఆ ముష్కర మూకల దాడులను ఎదుర్కొంటున్న దేశం నేరుగా అటాక్ కు దిగొచ్చిని, ఇప్పడు భారత ప్రభుత్వం చేసింది అదేనని చెప్పారాయన.
పాక్ పిచ్చి పనులు చేసినా.. మన సేనలు రెడీ
భారత ప్రభుత్వం ఇక లష్కరే, జైషే వంటి సంస్థలను పూర్తిగా మట్టుబెట్టడంపై దృష్టి పెట్టాలని ఒవైసీ అన్నారు. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ల అంతుచూడాలని చెప్పారు. భారత వాయుసేన చేసిన దాడితో పాక్ ఏవైనా పిచ్చి పనులకు దిగితే వారికి బుద్ధి చెప్పడానికి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా హై అలర్ట్ లో ఉన్నాయని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ.
ఇవాళ తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో పుల్వామా దాడికి భారత ప్రభుత్వం ప్రతీకార దాడి చేసింది. పాక్ లోని జైషే క్యాంపులపై భారత వాయుసేన యుద్ధ విమానాలతో 1000 కేజీల బాంబులు కురిపించింది. దాదాపు 300 మంది ఉగ్రవాదులను, జైషే ఆయుధాల గోడౌన్లను మట్టుబెట్టింది.