
- డే నైట్ టెస్ట్ ఆడని వాళ్ల మాటలు పట్టించుకోనవసరం లేదు
అహ్మదాబాద్: మ్యాచ్ రిజల్ట్ అనంతరం పిచ్ కండిషన్పై విమర్శలు రావడం చాలాకాలంగా ఉందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కనీసం ఒక్క పింక్ బాల్ మ్యాచ్ కూడా ఆడని వాళ్లు కూడా కామెంట్ చేయడం దురదృష్టకరమన్నాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మొతెరాలో ఇండియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసియడంతో మాజీ క్రికెటర్లు, ఎనలిస్టులు చేసిన కామెంట్స్పై స్పందించిన అశ్విన్.. వరుస ట్వీట్స్తో శుక్రవారం వారికి కౌంటర్ ఇచ్చాడు. దీంతో పిచ్ వ్యవహారంపై మరింత దుమారం రేగింది. అయితే, శనివారం జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో తన ట్వీట్స్ను అశ్విన్ సమర్ధించుకున్నాడు. పిచ్పై కాకుండా ప్లేయర్ల మధ్య పోటీతత్వంపై దృష్టిపెడితే మంచిదని సూచించాడు.
మంచి పిచ్ అంటే ఏంటి?
పిచ్ విషయంలో వచ్చే నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోవడం లేదని అశ్విన్ చెప్పాడు. ‘మ్యాచ్ రిజల్ట్ తర్వాత పిచ్పై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం ఈ రోజు ఏదో కొత్తగా మొదలయ్యింది కాదు. చాలా కాలంగా ఈ అలవాటు ఉంది. ఇక మీద కూడా కొనసాగుతుంది. అందువల్ల ఈ నెగెటివ్ కామెంట్స్ వల్ల నేను ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలనే శుక్రవారం వరుస ట్వీట్స్ చేశా. ఇంగ్లండ్తో థర్డ్ టెస్ట్లో ఆడిన పిచ్ టెస్ట్ క్రికెట్కు సరైనదేనా అంటూ ఓ బ్రిటిష్ జర్నలిస్ట్ నాకు మెసేజ్ చేశాడు. ముందు మంచి పిచ్ అంటే ఏంటో చెప్పండని నేను ఎదురు ప్రశ్నించా. బ్యాట్కి బాల్కి మధ్య మంచి పోటీ ఉండాలంటూ అతను బదులు చెప్పాడు. కానీ, అసలు మంచి వికెట్ అంటే ఏంటి ? ఫస్ట్ డే పేసర్లకు అనుకూలించాలి.. ఆ తర్వాత వరుసగా బ్యాటింగ్ ఫేవర్గా ఉండాలి. లాస్ట్ రెండ్రోజులు స్పిన్ తిరగాలి అనే రూల్ అసలు ఎవరు పెట్టారు ? ఈ ఆలోచనను విడిచిపెట్టాలి. ఏదో ఊహించుకుని ఓ నిర్ణయానికి రావడం మానేయాలి. వికెట్ స్టాండర్డ్ గురించి అంతా ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రత్యర్థి, ఇంగ్లండ్ టీమ్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా పిచ్పై కంప్లైంట్ చెయ్యలేదు. వాళ్లు చెయ్యరు కూడా. ఎందుకంటే ఫారిన్ టూర్స్కు వెళ్లినప్పడు మేము కూడా అలాంటి ఫిర్యాదులు చెయ్యం. నిజానికి, మేము ఇప్పటిదాకా ఆడిన మూడు పింక్ బాల్ టెస్టులు మూడు రోజుల్లోపే ముగిశాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోని వాళ్లు.. ఒక్క పింక్ బాల్ మ్యాచ్ కూడా ఆడని వాళ్లు నేరుగా పిచ్ గురించి మాట్లాడితే వాళ్లకి ఏం సమాధానం చెబుతాం’ అని రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు.
యువీ ట్వీట్లో తప్పు లేదు
మొతెరా వికెట్ గురించి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్పై కూడా అశ్విన్ స్పందించాడు. ‘యువరాజ్ చేసిన ట్వీట్ నేను కూడా చూశా. తనంటే చాలా గౌరవం ఉంది. నేనున్న మైండ్సెట్కి ఆ ట్వీట్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశం నాకు కనిపించలేదు. మనలో చాలా మంది ఎవరో చెప్పింది విని అదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. అలాంటి వాళ్లలో పిచ్ వల్లే టీమ్ గెలిచిందని నమ్ముతున్న వారిని ఉద్దేశించే నేను ట్వీట్స్ చేశా. సరిగ్గా చెప్పాలంటే మనం చూసిన ఓ మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే. చాలామంది ఇండియా గెలిచిందని సంతోషపడతారు. అదో గొప్ప ఫీలింగ్. కానీ ఇండియా కాదు పిచ్ గెలిపిస్తోందని అనే వాళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి ఆలోచన అస్సలు ఉండకూడదు. కానీ అదే ఎక్కువ అవుతోంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
మైల్ స్టోన్స్ గురించి ఆలోచనే లేదు..
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్ల మైలు రాయిని దాటిన అశ్విన్ .. అనిల్ కుంబ్లే 619 వికెట్ల మైల్ స్టోన్ కు ఇంకా 218 దూరంలో ఉన్నాడు. కుంబ్లే రికార్డును బ్రేక్ చేస్తారా అనే ప్రశ్నకు స్పందించిన అశ్విన్ మైల్ స్టోన్స్ గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైందని అన్నాడు. ‘నేను మైల్ స్టోన్స్ గురించి ఆలోచించడం మానేసి చాలా ఏళ్లు అయింది. నా పెర్ ఫామెన్స్ ఎలా ఉంది. టీమ్కు మరింత కంట్రిబ్యూట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి వంటి విషయాల గురించే ఆలోచిస్తా. ఎందుకంటే కొంతకాలంగా నేను టెస్టులకే పరిమితమయ్యా. అందువల్ల చాన్స్ వచ్చిన ప్రతీసారి జట్టు కోరుకున్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగా, క్రికెటర్ గా ఎలా ఎదగాలనే దానిపైనే నా ఫోకస్ ఉంటుంది. దాని వల్లే చాలా హ్యాపీగా ఉంటున్నా. క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా. ఇదే పద్ధతిని కొనసాగిస్తా’ అని చెప్పాడు.