పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పిట్లోకి..

పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పిట్లోకి..
  • ఆ దేశ మొదటి సీడీఎఫ్​గా బాధ్యతలు 
  • ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌కూ ఆయనే బాస్ 
  • 2030 వరకు పదవిలో.. రాజ్యాంగ సవరణ ద్వారా సీడీఎఫ్​ పదవి సృష్టి
  • ఐదేండ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్​కూ ఆయనే బాస్

ఇస్లామాబాద్: పాకిస్తాన్  ఆర్మీ చీఫ్​ ఆసిమ్ మునీర్  త్రివిధ దళాలకు అధిపతి అయ్యారు. పాక్  మొదటి చీఫ్​ ఆఫ్  డిఫెన్స్  ఫోర్సెస్ (సీడీఎఫ్) గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇకపై ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కూ ఆయనే చీఫ్​గా వ్యవహరించనున్నారు. త్రివిధ దళాల అధిపతిగా ఆసిఫ్  ఐదేండ్ల వరకు కొనసాగుతారు. పాక్  రాజ్యాంగంలో వివాదాస్పద 27వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా సీడీఎఫ్  పదవిని సృష్టించారు. ఈ నెల 1న ఈ రాజ్యాంగ  సవరణల ప్రతిపాదనను సెనేట్  పాస్  చేసింది. 

దీంతో చైర్మన్  ఆఫ్ ద జాయింట్  చీఫ్స్  ఆఫ్  స్టాఫ్​ కమిటీ (సీజేసీఎస్ సీ) పదవి రద్దయింది. 1971లో భారత్ తో జరిగిన యుద్ధంలో పాక్  ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత 1976లో నాటి ప్రధాని జుల్ఫికర్  అలీ భుట్టో సీజేసీఎస్ సీ పదవిని సృష్టించారు. ప్రస్తుత సీజేసీఎస్ సీ జనరల్ సాహిర్  షంషాద్  మిర్జా పదవీకాలం ముగియడంతో గురువారం ఆయన రిటైర్  అయ్యారు. కాగా.. సీడీఎఫ్​గా బాధ్యతలు చేపట్టిన ఆసిమ్ మునీర్ 2030 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకూ త్రివిధ దళాలపై అధ్యక్షుడే పూర్తి ఆధిపత్యం చలాయించారు. తాజాగా ఆ అధికారాన్ని అధ్యక్షుడి నుంచి సీడీఎఫ్ కు బదిలీ చేశారు. దీంతో పాక్​ అధ్యక్షుడికి ఉన్న న్యాయపరమైన రక్షణ సీడీఎఫ్​కూ ఉంటుంది. సీడీఎఫ్ పదవిలో ఉన్నంత కాలం ఆసిమ్ మునీర్​పై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదు. సీడీఎఫ్​తో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్​లకూ ఈ రక్షణలు ఏర్పాటు చేశారు.