
- డీఎస్పీ, సీఐకి తీవ్ర గాయాలు
- ఐఈడీ పేల్చి ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టులు
- చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంట బ్లాక్ డోండ్రీలో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో మందుపాతర పేలి కుంట ఏఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజి(42) మృతిచెందారు. అలాగే, కుంట డీఎస్పీ భానుప్రతాప్ చంద్రాకర్, సీఐ సోనాల్ గ్వాలా తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సుక్మా జిల్లా కుంట బ్లాక్లోని డోండ్రీ గ్రామ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన డీఎస్పీ, సీఐకి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన ట్రీట్మెంట్కోసం హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. ఏఎస్పీ ఆకాశ్రావు మృతిపై చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల అణచివేతలో సాహసోపేతంగా విధులు నిర్వర్తించి వీరమరణం పొందారని కొనియాడారు. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
వ్యూహాత్మకంగా బలగాలను రప్పించి..
మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు తెంటు లక్ష్మీనర్సింహాచలం, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్మృతితో మావోయిస్టులు వ్యూహాత్మకంగా అంబుష్ వేసి, బలగాలను తమ ఉచ్చులోకి రప్పించి ఐఈడీని పేల్చారు. ఈ నెల 10న భారత్ బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కుంట సమీపంలోని డోండ్రీ గ్రామంలో క్రషర్ మిల్లు వద్ద జేసీబీని తగలబెట్టారు.
భద్రతాబలగాలు అక్కడికి వస్తాయన్న అంచనాతో జేసీబీ చుట్టూ రెండు అడుగుల లోతులో ప్రెషర్ బాంబులను అమర్చారు. జేసీబీని తగలబెట్టిన సమాచారంతో సోమవారం ఉదయం ఏఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజి, డీఎస్పీ భానుప్రకాశ్ చంద్రాకర్, సీఐ సోనాల్ గ్వాలా తమ బలగాలతో కలిసి డోండ్రీకి చేరుకున్నారు. వెహికల్లో వెళ్తే బాంబుదాడి జరిగే ప్రమాదం ఉంటుందని భావించి కాలినడకన వెళ్లారు. తగలబెట్టిన జేసీబీ వద్ద బాంబులు పెట్టిన విషయాన్ని గమనించక.. ఐఈడీపై కాలు పెట్టిన ఏఎస్పీ ఆకాశ్రావు అది పేలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనే ఉన్న డీఎస్పీ, సీఐ తీవ్రంగా గాయపడ్డారు.
కూతురు పుట్టిన రోజుకు వస్తానని మాటిచ్చిన ఏఎస్పీ
ఈ నెల11న ఏఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజి కూతురు పుట్టిన రోజు. బర్త్డే నాడు రాయ్పూర్లోని ఇంటికి వస్తానని ఆమెకు మాటిచ్చారని తెలిసింది. ఇంతలోనే ఆయన చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆకాశ్రావు 2013లో డీఎస్పీగా పోలీసుశాఖలో చేరారు. 2019–-20లో పోలీస్మెడల్ అందుకున్నారు. 2024లో ఏఎస్పీగా ప్రమోషన్రాగా.. కుంటకు బదిలీ అయ్యారు.