గౌహతి: డ్రగ్స్ కొనడం కోసం ఓ వ్యక్తి కన్న కొడుకునే అమ్మకానికి పెట్టాడు. రూ.40 వేలు సొమ్ము తీసుకుని రెండున్నరేళ్ల పసివాడిని ఓ మహిళకు ఇచ్చేశాడు. ఆ పిల్లాడి తల్లి కంప్లైంట్తో పోలీసులు రంగంలోకి దిగి.. కాపాడి ఆమెకు అప్పగించారు. ఈ ఘటన అస్సాంలోని మోరిగన్ జిల్లాలో జరిగింది.
అస్సాం రాజధాని గౌహతి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరిగన్ సమీపంలోని లహరిఘాట్ గ్రామానికి చెందిన అమీనుల్ ఇస్లామ్ అనే వ్యక్తి తన రెండున్నరేళ్ల కొడుకుని సాజిదా బేగం అనే మహిళకు అమ్మేశాడు. అమీనుల్ ఇస్లామ్ కొన్నేండ్లుగా డ్రగ్స్ గ్యాంగులతో తిరుగుతూ ఉండడంతో అతడి భార్య రుక్మిణా బేగం మార్చే ప్రయత్నం చేసింది. అయితే అతడు వినకపోవడంతో విసుగు చెందిన తమ కొడుకును తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆధార్ సాకు చెప్పి కొడుకును తీసుకెళ్లి..
రుక్మిణా బేగం భర్త నుంచి దూరంగా వెళ్లినా అతడు ఆ తల్లిబిడ్లను వదలలేదు. డ్రగ్స్ కొని అమ్మేందుకు డబ్బు చాలకపోవడంతో అమీనుల్ తన కొడుకును అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రుక్మిణా బేగం దగ్గరకు వెళ్లి కొడుకుకి ఆధార్ కార్డు చేయించాలని సాకు చెప్పి తీసుకెళ్లాడు. కానీ రెండు మూడ్రోజులు గడిచిపోయినా పిల్లాడిని తీసుకుని రాకపోవడంతో ఏమైనా చేసుంటాడేమో అని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో గురువారం ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు అమీనుల్ ఇస్లామ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. గొరోయ్మరికి చెందిన సాజిదా బేగం అనే మహిళ దగ్గర 40 వేల రూపాయలు అమ్మేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ బిడ్డను రక్షించి తల్లికి ఆదివారం నాడు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అమీనుల్ డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ లాంటి ఇతర ఇల్లీగల్ యాక్టివిటీకూ పాల్పడుతున్నట్లు తేలింంది.