త్రిపురలో పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా

త్రిపురలో  పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు.

మొత్తం 60 స్థానాలకు 259 మంది బరిలో ఉన్నారు. త్రిపురలో 28 లక్షల 13 వేల మంది ఓటర్లు  ఉన్నారు. 3,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 1,100 కేంద్రాలను సున్నితమైనవిగా, 28 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 

60 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 31వేల మంది ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. కేంద్రం నుంచి 25వేల మంది, రాష్ట్రం నుంచి 31వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్టేట్ పోలీస్ చీఫ్​ ప్రకటించారు.

55 స్థానాల్లో బీజేపీ పోటీ

బీజేపీ 55 స్థానాల్లో, ఐపీఎఫ్​టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇందులో ఒకచోట ఫ్రెండ్లీ ఫైట్​ ఉంటుందని చెప్పారు. సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 13 సెగ్మెంట్స్​ నుంచి బరిలో దిగింది. ఇక తిప్రమోత పార్టీ 42 స్థానాల్లో బరిలో దిగింది. టీఎంసీ 28 స్థానాల్లో, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున 12 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్​ నడ్డా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సీపీఎం తరఫున  సీతారాం ఏచూరి, సీనియర్ నేతలు కారత్ ప్రచారం చేశారు.