తూర్పున సిట్టింగులకే సీట్లు..ముగ్గురు పాత కాపులకే బీఆర్ఎస్​ టికెట్లు

తూర్పున సిట్టింగులకే సీట్లు..ముగ్గురు పాత కాపులకే బీఆర్ఎస్​ టికెట్లు
  • ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మొండి చెయ్యి
  • ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మికి చాన్స్
  • నిర్మల్​ నుంచి ఇంద్రకరణ్​రెడ్డి
  • వ్యతిరేకత వచ్చినా ముధోల్​ టికెట్​విఠల్​రెడ్డికే..

మంచిర్యాల/నిర్మల్/ ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ టికెట్లను సిట్టింగ్​ఎమ్మెల్యేలకే కేటాయించారు. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే ఊహాగానాలకు సీఎం కేసీఆర్​తెరదించారు. మంచిర్యాలలో బలంగా ఉన్న కాంగ్రెస్​ను ఢీకొట్టాలంటే దివాకర్​రావే సరైన అభ్యర్థి అని కేసీఆర్​భావించినట్టు సమాచారం. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే చిన్నయ్యపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పటికీ అక్కడ బీఆర్​ఎస్​కు బలమైన లీడర్​లేకపోవడంతో ఆయనకే టికెట్​రెన్యూవల్​చేసినట్టు తెలుస్తోంది. చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఆయన ధర్మపురి లేదా చొప్పదండి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ సుమన్​ రెండోసారి చెన్నూర్ నుంచే పోటీ చేయడం ఖాయమైంది.

నడిపెల్లి ఐదోసారి.. 

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు రెండు సార్లు కాంగ్రెస్​నుంచి, మరో  రెండు సార్లు టీఆర్​ఎస్ నుంచి గెలిచారు. ఆయన 1999 ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి అప్పటి లక్సెట్టిపేట ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో తిరిగి అదే పార్టీ నుంచి గెలిచారు. 2009 జనరల్​, 2010 బైపోల్స్​లో టీఆర్​ఎస్​అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి విజయం సాధించారు. ఈసారి గెలిస్తే ఐదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించనున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హ్యాట్రిక్​రేసులో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు టీఆర్ఎస్​నుంచి ఎన్నికయ్యారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్  కొట్టాలనుకుంటున్నారు. చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​2014లో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు.  కిందటి ఎన్నికల్లో ఆయన చెన్నూర్​నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. రెండోసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

ఇద్దరు సిట్టింగ్ లకు జై.. ఒకరికి నై..

నిర్మల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను రెండు సెగ్మెంట్లలో సిట్టింగ్ ల కు టికెట్లు కేటాయించగా, మరో చోట కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించింది. నిర్మల్ ని యోజకవర్గం నుంచి అనుకున్నట్లుగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఇవ్వగా ముధోల్ సె గ్మెంట్ నుంచి ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్లను ఖరారు చేసింది. విఠల్ రెడ్డికి టికెట్ రాదని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం ఆయనపైనే నమ్మకముంచింది. దీంతో ఆయన రెండోసారి బరిలో నిలిచారు.

ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే రేఖా నాయక్ ను పక్కన పెట్టి మంత్రి కేటీఆర్​కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్​కు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ తండాకు చెందిన జాన్సన్ పీజీ పట్టభద్రుడు. ఆయన పూర్వీకులంతా ఖానాపూర్ సెగ్మెం ట్ లో ఉన్నారు. దీంతో ఇక్కడి గిరిజనులతో ఆయనకు పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి. వీటి కారణంగానే ఆయన మొదటి నుంచి ఖానాపూర్ టికెట్ ను ఆశిస్తున్నారు. ​ఏడాది కాలంగా ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ పరమైన కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తుండటంతో ఆయనకు టికెట్​దక్కింది.

సర్వేల్లో  ముందున్న వారికే..

ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు సీఎం కేసీఆర్ మొండి చేయి చూపారు. పార్టీ పరంగా నిర్వహించిన సర్వేల్లో ఆత్రం సక్కుకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్(టి) నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకే కేటాయించారు. నియోజకవర్గంలో ప్రధాన నేతగా ఉన్న కోనప్పపైనే అధిష్ఠానం నమ్మకముంచింది. కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలిచే సత్తా ఉందనే నమ్మకంతో ఆయనకే టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.