- ఉమ్మడి ఏపీలో, కేంద్రంలో అపార అనుభవం
- వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన సీఎం..
- ఐటీ, ఇండస్ట్రీస్ శాఖలు.. స్పీడ్, సీఎంవో ఇన్వెస్ట్ మెంట్ సెల్
- సీఈవోగానూ అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు
నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న కే రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది.
ఆయన 2029 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. దీంతో దాదాపు రెండున్నర ఏండ్లకు పైగా రాష్ట్ర సీఎస్గా కొనసాగనున్నారు. కాగా, కొత్త సీఎస్కు అత్యంత కీలకమైన పరిశ్రమలు , సమాచార, సాంకేతికత, -కమ్యూనికేషన్ల (ఐటీఈ అండ్ సీ) శాఖల పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.
వీటితోపాటు సీఎంవో పరిధిలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఈవో , అలాగే ప్రతిష్టాత్మకమైన ‘స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ’ (స్పీడ్) విభాగాల పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆయనకున్న పూర్వ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
కేంద్ర సర్వీసుల్లోనూ అపార అనుభవం
మధ్యప్రదేశ్కు చెందిన సంజయ్ జాజుకు ఉమ్మడి ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఉంది. ఆయన గతంలో విజయవాడ సబ్ కలెక్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా సేవలందించారు. వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పు డు పౌర సేవల డిజిటలైజేషన్ కోసం ఆయన తెచ్చి న ‘సౌకర్యం’ ప్రాజెక్ట్ అంతర్జాతీయ గుర్తింపు పొం దింది.
అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, ఇన్కాప్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే ‘మీసేవ’ పోర్టల్ను డిజైన్ చేసి.. జాతీయ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డును దక్కించుకున్నారు. ఆ తర్వాత 2014 అక్టోబర్లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన సంజయ్ జాజు.. జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా, రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీగా ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగ స్టార్టప్ల ప్రోత్సాహక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ బోర్డులోనూ సేవలు అందించిన ఆయన, ఇటీవలి కాలంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అత్యున్నత బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తిరిగివస్తున్నారు.
వ్యూహాత్మకంగా ఎంపిక..
రాష్ట్రంలో స్పెషల్ సీఎస్లుగా ఉన్న 1992 బ్యాచ్ అధికారులు వికాస్రాజ్, జయేశ్రంజన్ సీఎస్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు సెంట్రల్ సర్వీసులో ఉన్న సంజయ్ జాజు వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. కాగా, ఆయన ఎంపిక వెనక సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
కేంద్రంలో పనిచేసిన అనుభవంతో ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులను చక్కబెట్టాలనేది ఆయన వ్యూహాంగా కనిపిస్తున్నది. దాంతోపాటు ఉమ్మడి ఏపీలో జిల్లా కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా, సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో రాష్ట్ర పరిపాలన విభాగంలోనూ తనదైన ముద్ర వేస్తారని సీఎం భావించారు.
ఐటీ వింగ్లో స్పెషలిస్ట్గా ఉన్న సంజయ్ జాజు.. పరిపాలనలో టెక్నాలజీని విపరీతంగా ప్రమోట్ చేయనున్నట్టు తెలిసింది. పైగా వికాస్రాజ్, జయేశ్ రంజన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కీలక శాఖల్లో ఉన్నారు. దీంతో అటు బీఆర్ఎస్తో పనిచేయకుండా కేంద్రంలో సత్సంబంధాలు ఉన్న సంజయ్ జాజుకు ఇవ్వడమే మేలని సీఎం భావించినట్టు సెక్రటేరియేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
