హైదరాబాద్, వెలుగు: అధికారం చేపట్టి తొమ్మి దేండ్లవుతున్నా అసెంబ్లీని ఎలా నడపాలో బీఆర్ఎస్ సర్కారుకు ఇంకా తెలియడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఓ కామెడీ సినిమా అనుకునేలా నేతలు మార్చేశారని విమర్శించారు. కేటీఆర్, మల్లారెడ్డి జోకర్లుగా మారారన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం రేవంత్ రెడ్డిని విమర్శించేందుకే పెట్టినట్టుగా ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్ను కేసీఆరే ఏం చేయలేకపోయారని, అలాంటిది కేటీఆర్ ఏం చేయగలరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగితే.. కేసీఆర్ హయాంలో అవినీతి, అక్రమాలు లెక్కలేకుండా జరుగుతున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నోళ్లంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. మహారాష్ట్రలో చనిపోయిన రైతుల గురించి మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్రంలో చనిపోయిన రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.