న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్షోభంపై అక్కడి స్థానిక పార్టీలతో చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడర్ సంజయ్ కుమార్తో పాటు మిగతా పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టింగ్స్ నిర్వహించాలని, ఇది అందరి హక్కు అని ఈ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు తెలిసింది. అలాగే కరోనా సోకిన పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్తోపాటు కంటోన్మెంట్ జోన్స్లో ఉన్న అన్ని కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం.
ఢిల్లీలో కరోనా తీవ్రతపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం కేజ్రీవాల్, కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్ష వర్ధన్తోపాటు మేయర్స్, హయ్యర్ అఫీషియల్స్తో షా ఆదివారం చర్చించారు. అమిత్షాతో మీటింగ్ బాగా సాగిందని, కీలక అంశాలపై కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా సిట్యువేషన్ రోజురోజుకీ తీవ్రమవుతున్నందున టెస్టింగ్స్ సంఖ్యను పెంచనున్నారు. ఇందులో భాగంగా రెండ్రోజుల్లో టెస్టింగ్స్ సంఖ్య డబుల్ అవుతుందని, మరో ఆరు రోజుల్లో ట్రిపుల్ అవుతుందని షా పేర్కొన్నారు. అలాగే అన్ని కంటైన్మెంట్ జోన్స్లో కరోనా వ్యాప్తిని కనుగొనడానికి ప్రతి వ్యక్తికి సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహిస్తామన్నారు.