
హనుమకొండ: అంబేద్కర్ భవన్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జేపీఎస్ లు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జి.రాజేశ్వరరావు మాట్లాడుతూ... జీవో 26 ను రద్దు చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషనరీ పీరియడ్ ను 4 నుంచి మూడేండ్లకు తగ్గించి సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ఇవ్వాలని, ప్రొబేషనరీ పీరియడ్ ను సర్వీస్ కింద పరిగణించాలని అన్నారు.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగం కోల్పోయిన 98 మందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడంతో పాటు పంచాయతీ కార్యదర్శుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన కార్యదర్శుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్ గ్రేషియోతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కిరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు.