గుజరాత్ తీరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

గుజరాత్ తీరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

అహ్మదాబాద్‌ : దేశంలో మరో అతి పెద్ద డ్రగ్‌ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. భారత్‌లోకి డ్రగ్స్‌ సరఫరా చేయాలన్న పాకిస్థాన్‌ కుట్రల్ని భగ్నం చేశారు. గుజరాత్‌ లోని సముద్ర తీర ప్రాంతంలో భారీగా మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారు. గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి రూ.200 కోట్లు విలువ చేసే 40 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ఫిషింగ్‌ బోటులో మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా సముద్రం మధ్యలోనే మాటువేసి పట్టుకున్నట్లు ఏటీస్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. బోటులో పాకిస్థాన్ కు చెందిన  ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

హెరాయిన్‌ను తరలిస్తున్న ఫిషింగ్‌ బోట్‌ను కచ్‌ జిల్లాలోని జఖౌ హార్బర్‌కు సమీపంలో సముద్రంలోనే కోస్ట్‌ గార్డ్‌, ఏటీఎస్‌ బృందాలు అడ్డుకున్నాయని తెలిపారు. హెరాయిన్‌ను గుజరాత్‌కు చేర్చిన తర్వాత అక్కడి నుంచి స్మగ్లర్లు రోడ్డు మార్గంలో పంజాబ్‌కు రవాణా చేయాలనుకున్నారని ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. తమకు వచ్చిన పక్కా సమాచారంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్‌ నుంచి బయల్దేరిన ఫిషింగ్‌ బోటును అడ్డుకున్నామన్నారు.