కానిస్టేబుల్ పై దాడికి యత్నం,  9 మందిపై కేసు

కానిస్టేబుల్ పై దాడికి యత్నం,  9 మందిపై కేసు

మల్లాపూర్, వెలుగు : కానిస్టేబుల్ పై దాడికి యత్నించిన ఘటనలో 9 మందిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని పాతధాంరాజ్ పల్లికి చెందిన కొమ్ముల చిన్నారెడ్డి, రొండ్ల రాజారెడ్డి, ఇప్ప గణేశ్, బెజ్జరాపు నరేశ్, గజ్జి నరేశ్, గజ్జి రమేశ్, పొలాస సురేశ్, ఎనగందుల రమేశ్, కలికోట గంగాధర్ మంగళవారం రాత్రి 12.45 గంటలకు గ్రామ పంచాయతీ వద్ద నిల్చున్నారు. కొందరు వ్యక్తులు 100కు డయల్ చేయడంతో హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు పెట్రోలింగ్ వెహికల్ లో యువకుల వద్దకు వచ్చి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోవాలని సూచించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న వారు హెడ్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించారు. చిన్నారెడ్డి అనే యువకుడు పోలీసులకు సంబంధించిన బ్లూ కోల్ట్స్​ పెట్రోలింగ్ ట్యాబ్ లను పగులగొట్టాడు. మిగతా వారు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి యత్నించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి సీఐ లక్ష్మీనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.