- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
యాదగిరిగుట్ట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. శనివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన పండిట్ దీన్దయాళ్ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం భారీగా నిధులు చెల్లిస్తున్నప్పటికీ తిరిగి ఏమీ రావడం లేదని సీఎం వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.13 లక్షల కోట్ల నిధులు అందించిందని పేర్కొన్నారు.
జాతీయ రహదారుల విస్తరణ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, ములుగు గిరిజన వర్సిటీ, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించిందని గుర్తు చేశారు. మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం
బీజేపీయేనన్నారు.
